ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సభ్యుడికి పాజిటివ్‌! | Sakshi
Sakshi News home page

ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సభ్యుడికి పాజిటివ్‌!

Published Mon, Jun 15 2020 2:45 AM

Minister Etela Rajender Advisor Tests Coronavirus Positive - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీలో ఓ కీలక సభ్యుడికి కరోనా వైరస్‌ సోకింది. నిమ్స్‌లో ఓ విభాగానికి అధిపతిగా, ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న ఆయన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సాంకేతిక సలహాదారుడిగా సైతం వ్యవహరిస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. వైరస్‌ సోకినట్టు ఆదివారం ఫలితా లువచ్చాయి.

కరోనా వైరస్‌ నియంత్రణకు అవలంభిస్తున్న విధానాలపై అధ్యయనం జరిపి సలహాలు ఇవ్వడానికి సీసీఎంబీ డైరెక్టర్, కాళోజి వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్, హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకులు/సీఈఓ, నిమ్స్‌ ప్రొఫెసర్‌తో గత మార్చి 22న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కరోనా నియంత్రణపై గతంలో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన పలు ఉన్నత స్థాయి సమీక్షల్లో ఈ నిపుణుల కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈటలకు సాంకేతిక సలహాదారుడిగా ఉన్న ఈ ప్రొఫెసర్‌.. మంత్రి పాల్గొనే కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో ఈటల రాజేందర్‌ క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement