పార్లమెంట్‌ పోరు | Lok Sabha Elections Telangana Politics | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ పోరు

Feb 4 2019 8:26 AM | Updated on Mar 9 2019 3:26 PM

Lok Sabha Elections Telangana Politics - Sakshi

సాక్షి, వనపర్తి: ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగా, గ్రామపంచా యతీ ఎన్నికల ఘట్టం సైతం సజా వుగా ముగిసింది. ఇప్పటిదాకా ప్రచారపర్వంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, అధికార యంత్రాంగం ఇక లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే చివరి నాటికి ఐదేళ్లు పూర్తవుతుంది. గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించనుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తున్న అభ్యర్థులు ఇప్పటికే తెరవెనక ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా సమన్వయ కమిటీ, కో ఆర్డినేషన్‌ కమిటీ.. ఇలా ఐదు  కమిటీలను నియమించింది. బీజేపీ ఈనెల 5న మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం లో ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటుచేసిం ది. అంతేకాకుండా రాష్ట్రంలో రెండో సారి అధికారం దక్కించుకున్న టీఆర్‌ఎస్‌.. గ్రామపంచాయతీ ఎన్ని కల్లో విజయఢంకా మోగించిన నేపథ్యంలో పార్ల మెంట్‌ స్థానాలను అదే రీతిలో దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇలా ప్రధాన పార్టీల తమ వ్యూహాల్లో నిమగ్నం కాగా.. అధికార యంత్రాంగ సైతం ఓటరు జాబితా, ఈవీఎంలను సిద్ధం చేయడంపై దృష్టి సారించింది. రెండు రోజుల క్రితం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు.

రెండు స్థానాలు దక్కించుకోవాలని  
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ఏపీ.జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి నంది ఎల్లయ్య ఎంపీగా గెలిచారు. రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ చెరొకటి గెలుచుకుని పోటాపోటీగా నిలి చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మ డి మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ 13 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్‌ పార్టీ కేవలం కొల్లాపూర్‌ స్థానంతోనే సరిపెట్టుకుంది.

అదేవిధంగా తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా గ్రామాల్లో విజయం సాధించారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్‌ ఎన్నికలు రానుండటంతో టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నా పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనను చూసి బీజేపీకే ఓటు వేస్తారని ఆ పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ మాత్రం మహబూబ్‌నగర్‌ సిట్టింగ్‌ ఎంపీ స్థానాన్ని నిలుపుకోవడంతో పాటు గత ఎన్నికల్లో చేజారిన నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రణాకలు రచిస్తోంది.

సిట్టింగ్‌లకు సీటు ఇస్తే... 
టీఆర్‌ఎస్‌ పార్టీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ పాటిస్తే మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీ జితేందర్‌రెడ్డికి బెర్త్‌ ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఇక 2014లో నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన మందా జగన్నాథం ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్‌ అసెంబ్లీ సీటును మందా జగన్నాథం కుమారుడు శ్రీనాథ్‌కు ఇస్తారని ముందుగా ప్రచారం సాగినా అలా జరగలేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మందాకు సీటు దక్కుతుందా లేక కొత్త వారికి అవకాశమిస్తారా, అన్నది వేచిచూడాల్సిందే.

కాంగ్రెస్‌లో పోటాపోటీ 
కాంగ్రెస్‌ పార్టీకి మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో మంచి పట్టు ఉన్నట్లు చెబతారు. అయినప్పటికీ ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా విఫలమవడంతో పాటు మాజీ మంత్రులు జిల్లెల చిన్నారెడ్డి, డీకే.అరుణ, నాగం జనార్దన్‌రెడ్డి, పార్టీ నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వంటి నేతలు ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీమంత్రి డీకే అరుణ, రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇక  నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇదేస్థానం నుంచి బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ కూతురు బంగారు శృతిని పోటీ చేయించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి ముగియకముందే పార్లమెంట్‌ ఎన్నికలు తెరపైకి రావడంతో మళ్లీ పార్టీలు, అధికార యంత్రాంగం బీజీగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement