
‘పోలవరం’ అడ్డుకుంటాం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవటమే జేఏసీ ప్రధాన ఎజెండా అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు
ఇదే జేఏసీ ప్రధాన ఎజెండా: కోదండరాం
భద్రాచలం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవటమే జేఏసీ ప్రధాన ఎజెండా అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలనే డిమాండ్తో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలో నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. గుప్పెడు మంది కార్పొరేట్ శక్తుల కోసం ఆదివాసీల ప్రయోజనాలను పణంగా పెట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవటం శోచనీయమన్నారు.
ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసీలను కదిలించేలా జాతి మొత్తం ఏకమై ఉద్యమాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివాసీ సంఘాల నాయకత్వంలోనే భవిష్యత్ ఉద్యమాలు జరగాలని, ఇందుకు జేఏసీ తోడుగా నిలుస్తుందన్నారు. ఆంధ్రా కోస్టల్ కారిడర్ కుట్రలకు, కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం, జలవిద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే డబ్బులకు ఆశపడే పోలవరం ప్రాజక్టు నిర్మాణాన్ని చేపట్టారని కోదండరాం ఆరోపించారు. గోదావరి జలాలను ఆంధ్రా వాళ్లు ఉపయోగించుకోవటానికి తెలంగాణ ప్రజలు వ్యతిరేకం కాదు, కానీ, రెండు ప్రాంతాల నడుమ సుహృద్భావ వాతావరణంలో మిగులు జలాలను సద్వినియోగపర్చుకోవటం సహేతుకమన్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులున్నాయని, తెలంగాణ ప్రభుత్వంలో వీటిపై మరింత ఒత్తిడి చేస్తామన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజాభీష్టం మేరకే ఏదైనా జరగాలన్నారు. త్వరలో ఢిల్లీలో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని భద్రాచంలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
నేనొస్తే.. నా స్థానం భర్తీ చేసేదెవరు?
ఖమ్మం: తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ఒకవేళ వస్తే తన స్థానం భర్తీ చేసే వారు ఉండాలి కదా? అని కోదండరాం వ్యాఖ్యానించారు. తనకు ప్రస్తుతం ఉన్న సీటే అలవాటైందన్నారు. రాజకీయరంగ ప్రవేశం ఎప్పుడని విలేకరులు ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు.