వీడిన ‘చెరువులో శవం’ మిస్టరీ | Kummarikuntla pond Mystery of dead body Murder Sexual harassment | Sakshi
Sakshi News home page

వీడిన ‘చెరువులో శవం’ మిస్టరీ

Apr 27 2016 2:34 AM | Updated on Jul 30 2018 8:29 PM

సుమారు తొమ్మిది నెలల క్రితం మండలంలోని కుమ్మరికుంట్ల చెరువులో తేలిన మృతదేహం మిస్టరీ ఎట్టకేలకు వీడింది.

నర్సింహులపేట : సుమారు తొమ్మిది నెలల క్రితం మండలంలోని కుమ్మరికుంట్ల చెరువులో తేలిన మృతదేహం మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హతుడి భార్య, ఆమె చెల్లెలు కలిసి ఓ హంతక ముఠాకు సుఫారి ఇచ్చి అతడిని హత్య చేయించినట్లు విచారణలో వెల్లడైంది. లైంగిక వేధింపులు భరించలేకనే ఈ పనికి ఒడిగట్టినట్లు నిందితురాలు అంగీకరించింది. ఎస్సై వెంకటప్రసాద్ చేధించిన ఈ కేసు మిస్టరీ వివరాలను తొర్రూరు సీఐ శ్రీధర్‌రావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూర్ మండలంలోని చింతాయిగూడెం గ్రామానికి చెందిన పులిపాక పెద్దిరాజుకు 1985లో సుబ్బలక్ష్మితో వివాహమైంది.

వారికి ముగ్గురు కుమార్తెలు జన్మించగా వారికి వివాహం చేశారు. అయితే పెద్దిరాజుకు స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలో అతడు సుబ్బలక్ష్మి చిన్నమ్మ కూతురైన  దువ్వ పద్మను లైంగికంగా వేధించసాగాడు. వేధింపులు భరించలేక ఆమె తన అక్క సుబ్బలక్ష్మికి చెప్పింది. చివరికి వారు పెద్దిరాజును హత్య చేయించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా రాజోలుకు చెందిన రవితో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు. అతడు రూ.10 లక్షలకు మర్డర్ చేసేందుకు ఒప్పుకోగా రెండు ధపాలుగా రూ.3 లక్షల చొప్పున ముట్టజెప్పారు. అనంతరం 2015, ఆగస్టు 15న రవి కొంతమందితో కలసి పెద్దిరాజును ఖమ్మంకు తీసుకొ చ్చి హత్య చేశాడు. మృతదేహాన్ని కుమ్మరికుంట్ల చెరువులో పడేశారు. మృతదేహం మరుసటి రోజు చెరువులో తేలడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
జేబుపై పేరుతో కూపీ లాగిన ఎస్సై
మృతుడి చొక్కా జేబుపై ఎంవీ రావు, తాడేపల్లిగూడెం అని లభించిన చిన్న క్లూ ఆధారంగా ఎస్సై వెంకటప్రసాద్ విచారణ చేపట్టారు. పలుమార్లు ప్రత్యేక బృందాలను పంపి స్థానికంగా ఫొటో ఆధారంగా విచారణ చేపట్టారు. ఉంగటూరు పోలీస్‌స్టేషన్‌లో కొన్నాళ్ల తర్వాత నమోదైన పెద్దిరాజు మిస్సింగ్ కేసు ఆధారంగా కేసు మిస్టరీని చేధించారు. హతుడి భార్య సుబ్బలక్ష్మిని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కీలక నిందితులైన రవి, పద్మతోపాటు మరికొందరు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్సై వై. వెంకటప్రసా ద్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement