
ప్రారంభించారు..వదిలేశారు
ఆర్భాటంగా ప్రారంభించిన ఆ రోడ్డు పనులను ఆరు నెలలుగా పట్టించుకోకపోవడం, ప్రజాప్రతినిధులు పదిరోజుల్లో ..
కొత్తపెల్లి రోడ్డు పనులపై గ్రామస్తుల ఆందోళన
వర్ధన్నపేట టౌన్ : ఆర్భాటంగా ప్రారంభించిన ఆ రోడ్డు పనులను ఆరు నెలలుగా పట్టించుకోకపోవడం, ప్రజాప్రతినిధులు పదిరోజుల్లో ప్రారంభమవుతాయని ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం మండల కేంద్రంలోని సంగెం వాగు వద్ద ల్యాబర్తి, కొత్తపెల్లి గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోకు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. వివరాల్లోకి వెళ్లితే.. సంగెం వాగు నుంచి అన్నారంకు వెళ్లే రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులకు రూ.11 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గత సంవత్సరం నవంబర్లో మంత్రి కేటీఆర్ ఈ పనులు ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ ఆరు నెలల నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది పరిస్థితి.
కాగా, ఇటీవల ఎమ్మెల్యే అరూరి రమేష్ శ్రీరామనవమి సందర్భంగా కొత్తపెల్లి గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఆయనను నిలదీశారు. దీనిపై రహదారి పనులు ఏప్రిల్ 24న పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. కానీ ఇంతవరకు పనులు జరగడంలేదని గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సిలువేరు కుమారస్వామి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి జన్ను రాములు, కాంగ్రెస్ నాయకుడు కొండేటి సత్యం మాట్లాడుతూ ఆరు నెలల క్రితం రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన పనులు ప్రారంభించలేదన్నారు.
పనులు ప్రారంభించమని కాంట్రాక్టర్ను కోరితే డబ్బులు లేవని, తొందరేమిటని, తనకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని, తనను ఎవరు ఏమి చేయలేరని మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడితే వారిలో స్పందన కరువైందన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పం దించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తూల్ల కుమారస్వామి, ఏరుకొండ వేణుగోపాల్రావు, మార్త సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.