
సాక్షి, హైదరాబాద్ : అధికారంలో ఉన్నవారికి గవర్నర్లు బ్రోకర్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే ఆ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సోమవారం డిమాండ్ చేశారు. ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబును రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఎందుకు అంత హడావుడిగా కలవాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబుకు మధ్య రాజీ కుదర్చడానికే నరసింహన్ సమావేశమైనట్టుగా అర్థం చేసుకోవాలా అని నారాయణ ప్రశ్నించారు. ఇలాంటి గవర్నర్లతో ప్రజాధనం వృథా మినహా ఎటువంటి ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. కావేరి జలాల సమస్య పరిష్కారానికి కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. సీపీఐ 23వ జాతీయ మహాసభలు కేరళలో జరుగుతాయని ఆయన వెల్లడించారు.