ఇంజనీరింగ్‌లో 48,982 సీట్లే భర్తీ  | Engineering replaced 48,982 seats | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌లో 48,982 సీట్లే భర్తీ 

Jul 26 2018 1:19 AM | Updated on Jul 26 2018 1:19 AM

Engineering replaced 48,982 seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో భాగంగా చేపట్టిన ఎంసెట్‌ చివరి దశ సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ బుధవారం ప్రకటించింది. ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మ్‌–డి కోర్సుల్లో కొత్తగా 2,781 మంది విద్యార్థులకు సీట్లు లభించగా, 7,168 మంది ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి తమ సీట్లను మార్చుకున్నారు. చివరి కౌన్సెలింగ్‌ ముగిసేనాటికి 190 ఇంజనీరింగ్‌ కన్వీనర్‌కోటాలో 66,058 సీట్లు ఉండ గా, అందులో 48,982 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 17,076 సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి.

ఇక 117 కాలేజీల్లో బీఫార్మసీ(ఎంపీసీ స్ట్రీమ్‌)లో 3,224 సీట్లు ఉండగా, 134 సీట్లే భర్తీ అయ్యాయి. మరో 3,090 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 51 కాలేజీల్లో ఫార్మ్‌–డీలో 500 సీట్లు ఉండగా, 54 సీట్లు మాత్రమే భర్తీ కాగా 446 సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని, ఈ నెల 27లోగా ఫీజు చెల్లించాలని సూచించింది. జాయినింగ్‌ రిపోర్టును డౌన్‌లోడ్‌ చేసుకొని కాలేజీల్లో ఈ నెల 27లోగా చేరాలని పేర్కొంది. సీట్లు వద్దనుకునే వారు కూడా 27లోగానే ఆన్‌లైన్‌లో సీట్లను రద్దు చేసుకోవాలని వెల్లడించింది.   రాష్ట్రంలోని 45 కాలేజీల్లో (12 వర్సిటీ కాలేజీలు, 33 ప్రైవేటు కాలేజీలు) వందశాతం సీట్లు భర్తీ అయ్యా యని కమిటీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement