హస్తినకు చేరిన హస్తం రాజకీయం!

congress leaders oppose nagam janardhan reddy to join in their party - Sakshi

కాంగ్రెస్‌లోకి నాగం రాకను అడ్డుకునేందుకు పావులు కదుపుతున్న నాయకులు

ఢిల్లీకి చేరిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, కొల్లాపూర్‌ ఇన్‌చార్జ్‌ హర్షవర్ధన్‌రెడ్డి

ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ మంత్రి డీకే అరుణల ద్వారా అధిష్టానం దృష్టికి తెచ్చే యత్నం

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియాను కలిసి గోడు వెళ్లబోసుకున్న నేతలు  

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : కందనూలు కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు ఢిల్లీకి చేరారు. నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై అధిష్టానం దగ్గర తాడోపేడో తేల్చుకునేందుకు నాగర్‌కర్నూల్‌ ఎంపీ నంది ఎల్లయ్య నేతృత్వంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, కొల్లాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బీరం హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లారు. మాజీ మంత్రి డీకే అరుణ సైతం అధిష్టానానికి ఇక్కడి పరిస్థితులను వివరించేందుకు వీరితోపాటు ఉన్నారు. నాగంను పార్టీలోకి తెచ్చేందుకు జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ నేత నేరుగా అధినేత రాహుల్‌గాంధీతో చక్రం తిప్పుతున్నారని, సదరు నేత తన నియోజకవర్గంలో ఎందుకు కల్పించుకుంటున్నారని ఎంపీ నంది ఎల్లయ్య ఆయన విషయాన్ని అధిష్టానం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అంతటితో ఆగకుండా నేరుగా రాహుల్‌గాంధీని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, రెండు నెలలుగా ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నానని ప్రచా రం చేసుకోవడం వల్ల ఇటు నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో, అటు కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు అయోమయానికి లోనవుతున్నారని కుంతియా దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు నాగం జనార్దన్‌రెడ్డి తనకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని సన్నిహితులతో చెప్పుకుంటుండడంతో తాను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి అడిగామని,  తనకేమీ తెలియదని ఆయన చెప్పడంతో ఢిల్లీకి వచ్చానని ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఫోన్‌ లో ‘సాక్షి’కి వివరించారు. 20ఏళ్లుగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో పరాభవాలను లెక్కచేయకుండా పార్టీ కార్యకర్తల అభిమానంతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఇప్పుడు నాగం జనార్దన్‌రెడ్డి వస్తే కాంగ్రెస్‌ పార్టీని ఆయన చేతుల్లో ఎలా పెడతామని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. ఎవరు అంగీకరించినా కార్యకర్తలు మాత్రం నాగంని అంగీకరించరని, ఆయన కాంగ్రెస్‌ కార్యకర్తలపై పెట్టిన కేసులు, చేయించిన దాడులను ఇప్పటికీ మర్చిపోలేదని గుర్తు చేశారు.  

కొల్లాపూర్‌కూ రానివ్వం..
నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరి నాగర్‌కర్నూల్‌ కాకపోతే కొల్లాపూర్‌లో పోటీ చేస్తారన్న ప్రచారం వెనక కుట్ర దాగి ఉందని కొల్లాపూర్‌ కాంగ్రె స్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. నాగం ప్రధాన అనుచరుడైన జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరాక తనకే టికెట్‌ వస్తుందని ప్రచారం చేసుకుంటుండడంతో ఇదివరకే ఈ అంశాన్ని డీకే అరుణ దృష్టికి తీసుకొచ్చామని, ఆమె సైతం దీనిని ఖండించారని గుర్తు చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ఈ విషయం అధిష్టా నం ఇప్పుడే తేలిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయ న వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో తనకే టికెట్‌ వస్తుందని చెప్పారు. పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడంతో పాటు గత ఎన్నికల్లో మంత్రి కృష్ణారావు చేసిన కుట్రల ద్వారా పరాజయం పాలైనా కొల్లాపూర్‌ నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేస్తూ వస్తున్నానని వివరించారు. మరోవైపు నాగం జనార్దన్‌రెడ్డి పార్టీలోకి రాకుండా డీకే అరుణ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయిలో ఉన్న విషయం అంద రికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడి నేతలిద్దరూ అరుణ మద్దతుతో రాహుల్‌గాంధీని కలుస్తుండడంతో వార్తలు ఇటు కాంగ్రెస్‌ కార్యకర్తలు, అటు జిల్లా రాజకీయ నాయకుల్లో ఆసక్తికరంగా మారాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top