రాష్ట్రంలో నిరుపేదలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకం ఆయా వర్గాలకు కొంతమేరకు భరోసా కల్పిస్తోంది.
- గతంలోకన్నా ఐదు రెట్లు పెరిగిన పింఛను
- ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అత్యధికం
- కొన్ని జిల్లాల్లో అక్రమార్కుల పాలైన సొమ్ము
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుపేదలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకం ఆయా వర్గాలకు కొంతమేరకు భరోసా కల్పిస్తోంది. వారి కనీస అవసరాలు తీర్చగలిగేలా ప్రతి నెలా రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు పింఛను ఇస్తోంది. ఈ పథకం కింద వృద్ధాప్య, వితంతు, వికలాంగులతోపాటు చేనేత, గీత కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కూడా పింఛను అందిస్తోంది. ఈ పథకాన్ని గత నవంబర్లో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. బీడీ కార్మికులకూ ఆసరా వర్తింపజేయడంతో ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 36 లక్షలకు చేరింది. ఈ పథకానికి ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు ఖర్చుపెడుతోంది.
తెలంగాణలోనే పింఛను సొమ్ము అధికం
దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే దాదాపు అన్ని కేట గిరీల పింఛనర్లకు అధిక మొత్తం పింఛను లభిస్తుండడం విశేషం. గత సెప్టెంబర్ వరకు పేదలకు రూ. 200 చొప్పునే పింఛను అందగా అక్టోబర్ నుంచి వారికి రూ. 1,000 లభిస్తోంది. ఇప్పటివరకు వికలాంగులకు ఇస్తున్న పింఛనును రూ. 500 నుంచి రూ. 1,500కు ప్రభుత్వం పెంచింది. బీడీ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో మినహా దేశంలో మరెక్కడా పింఛను పథకాన్ని వర్తింపజేయట్లేదు. ఒకటి రెండు రాష్ట్రాల్లో ఇస్తున్నా లబ్ధిదారుల ఎంపికలో పరిమితులున్నాయి.
సామాజిక తనిఖీకి ఆదేశం
ఆసరా పథకం కొన్ని జిల్లాల్లో అక్రమార్కులపరమైనట్లుగా ఆరోపణలున్నాయి. దీంతో ఈ పథకంపై సామాజిక తనిఖీకి ప్రభుత్వం ఆదేశించింది. పథకం అమలుపై ఫిర్యాదులు, సలహాలకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 18002001001, ఈ-మెయిల్ ఐడీ ్చట్చట్చఞ్ఛటజీౌటఃజఝ్చజీ.ఛిౌఝని ఏర్పాటు చేసింది.
ఏ పింఛను ఎంత మందికి
వృద్ధాప్య 14,15,644
వికలాంగ 4,19,375
వితంతు 13,15,542
చేనేత కార్మికుల 33,557
గీత కార్మికుల 54,382
బీడీ కార్మికుల 3,58,994
మొత్తం 3,59,77,494