దసరా పండుగను పురస్కరించుకుని పట్టణాలు, పల్లెలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.
సాక్షి, సంగారెడ్డి: దసరా పండుగను పురస్కరించుకుని పట్టణాలు, పల్లెలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నవరాత్రోత్సవాలలో భాగంగా దేవీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే సంగారెడ్డిలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో విశ్వహిందూ పరిషత్ దసరా వేడుకలను నిర్వహిస్తోంది.
వేడుకల్లో భాగంగా సంగారెడ్డి పట్టణమంతా విద్యుద్దీపాలతో అలంకరించారు. పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ స్టేడియాన్ని సైతం భారీగా రంగురంగుల దీపాలతో అలంకరించారు. అలాగే భారీ రావణాసురుడి విగ్రహాన్ని రూపొందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటంతోపాటు రావణదహనం నిర్వహించనున్నారు.
పటాన్చెరు, గజ్వేల్లో ఏర్పాట్లు...
పటాన్చెరు, గజ్వేల్, సిద్దిపేట పట్టణాలు దసరా వేడుకలకు ముస్తాబయ్యాయి. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో దసరాను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గజ్వేల్ నగరపంచాయతీ ఆధ్వర్యంలో దసరా వేడుకలు జరగనున్నాయి. పటాన్చెరు, అమీన్పూర్, పాశమైలారం.. తదితర పట్టణాలు దసరా వేడుకలకు సిద్ధమయ్యాయి.
వేడుకల్లో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి పాల్గొనున్నారు. సిద్దిపేటలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. రావణదహనం చేయనున్నారు. వేడుకల్లో మంత్రి హరీష్రావు పాల్గొననున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట, మెదక్లలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.