రోడ్లు ఎవరు నిర్మిస్తే వారిదే బాధ్యత: కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే రెండేళ్లలో 290 కీలోమీటర్ల వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే రెండేళ్లలో 290 కీలోమీటర్ల వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్(టీబీఎఫ్)తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక నుంచి ఏ కాంట్రాక్టర్లు అయితే రోడ్లు నిర్మిస్తారో ఏడెళ్లపాటు వారే పూర్తి బాధ్యత వహించే విధంగా నిబంధన తీసుకొస్తున్నామన్నారు. ఇందు కోసం హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ను(హెచ్ఆర్డీసీఎల్)ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగర ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు ఏడాదిలోపు సిగ్నల్ ఫ్రీ జంక్షన్లను ఏర్పాటు చేస్తామన్నారు.
త్వరలోనే నాలుగు స్కైవే ఫ్లైఓవర్లను నిర్మిస్తామని కేటీఆర్ ప్రకటించారు. రెండు ఫ్లైఓవర్లను అంబర్పేట చే నెంబర్- ఉప్పల్, శామీర్పేట - తుర్కపల్లి రూట్లలో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. నర్సాపురం- బాలనగర్ రూ.400 కోట్లతో ఓ ఫ్లైఓవర్ నిర్మిస్తామని, బంజారాహిల్స్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటర్ కారిడర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నవంబర్ చివర్లో మెట్రో రైలు ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాదికల్లా మెట్రో పనులు పూర్తవుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు.