హయత్ నగర్లో కిడ్నాప్ కలకలం | abducted doctor relleased in hayath nagar | Sakshi
Sakshi News home page

హయత్ నగర్లో కిడ్నాప్ కలకలం

Dec 30 2015 6:25 PM | Updated on Sep 3 2017 2:49 PM

హయత్‌నగర్‌లో ఓ డాక్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది.

హైదరాబాద్‌ సిటీ: హయత్‌నగర్‌లో ఓ డాక్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. అరణ్య కాలనీలో ఉంటున్న బొర్ర రమేశ్ గౌడ్ అనే డాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. హయత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..బొర్ర రమేశ్ గౌడ్, దుర్గా రాణి అనే ఇద్దరు గతంలో ఓ ఆసుపత్రి పెట్టారు. విభేదాలు రావడంతో ఆసుపత్రిలో వాటాను రమేశ్ అమ్మేసుకున్నాడు. దీనికిగానూ దుర్గారాణి, రమేశ్‌కు రూ.30 లక్షల విలువైన చెక్‌లను ఇచ్చింది. ఆ చెక్‌లు చెల్లకపోవడంతో రమేశ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఈ కేసు ప్రస్తుతం నడుస్తోంది.

మరో క్లినిక్ ప్రారంభిద్దామని రమేశ్ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పోచంపల్లి వెళ్తుండగా కొత్తగూడెం చౌరస్తా వద్ద కారులో వచ్చిన ఆరుగురు దుండగులు ఆయనను కిడ్నాప్ చేశారు. కరీంనగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారు. తాము మావోయిస్టులమని ఈ విషయం ఎవరికైనా చెబితే భార్యాబిడ్డలను హతమారుస్తామని బెదిరించారు. అనంతరం రమేశ్‌ను ఘట్‌కేసర్ వద్ద విడిచిపెట్టి పారిపోయినట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement