
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హై దరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల ప్రాంతాల నుంచి కూడా రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్కు రైళ్లు నడుపుతామని తెలిపారు. లాక్డౌన్ వల్ల వలస కార్మికు లు పడుతున్న ఇబ్బందులపై సోమవారం ప్రగతి భవన్లో కేసీఆర్ సమీక్షించారు. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతా ల్లో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందు కు ఆసక్తి చూపుతుండటంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో దక్షి ణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో మాట్లాడి, మంగళవారం నుంచి 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కోరారు.
కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు రైళ్ల ద్వారా తరలిం చే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా, సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్రెడ్డిని ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా నియమించింది. తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అలా పేర్లు నమోదు చేసుకున్న వారిని రైళ్ల ద్వా రా తరలిస్తారు. పోలీస్ స్టేషన్లలోనే వివరాలు ఇస్తారు. ప్రభుత్వం కార్మికులను తమ సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినందున ఎవరూ ఆందోళన చెందొద్దని సీఎం కోరారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించి, కార్మికులను సమన్వయం చేయాలని పోలీసు అధికారులకు సూచిం చారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.