పత్రాలు ఇవ్వడానికి రూ.3 లక్షలు లంచం | Three Lakh Rupees Bribe Ask CI In A Legal Case | Sakshi
Sakshi News home page

పత్రాలు ఇవ్వడానికి రూ.3 లక్షలు లంచం

Jul 1 2018 1:37 PM | Updated on Aug 13 2018 2:57 PM

Three Lakh Rupees Bribe Ask CI In A Legal Case  - Sakshi

సీఐ జ్యోతిమహాలింగం 

అన్నానగర్‌ : ఇంటి పత్రాలను ఇవ్వడానికి రూ.3 లక్షలు లంచం అడిగిన తంజావూర్‌ సీఐపై శుక్రవారం సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఉంటున్న హాస్టల్‌ గదికి సీల్‌ వేశారు. వివరాలు.. తంజావూర్‌ పల్లియక్కిరకారకి చెందిన జోసఫ్‌ కుమారుడు అంథోనిస్వామి. జేసీబీ యంత్రాన్ని బాడుగకు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాడు. ఇతను తంజావూర్‌ మేలవీధిలో ఫైనాన్స్‌ సంస్థ నడుపుతున్న చంద్ర వద్ద 2016లో మూడు కంతుల వారీగా రూ.10.50 లక్షలు తీసుకున్నాడు. తన స్నేహితుల స్థలాలకు సంబంధమైన 4 దస్తావేజులను చంద్ర వద్ద అంథోనిస్వామి కుదువ పెట్టాడు. తరువాత అతను, అప్పుని కొద్ది కొద్దిగా వడ్డీతో చెల్లించాడు. వడ్డీతో కలిపి రూ.12.5 లక్షలు చెల్లించగానే తన దస్తావేజులను ఇవ్వమని అంథోనిస్వామి అడిగాడు.

ఇంకా నగదు ఇస్తేనే దస్తావేజులను తిరిగి ఇస్తానని చంద్ర తెలిపాడు. దీంతో అంథోని స్వామి కొన్ని నెలల ముందు తంజావూర్‌ జిల్లా ఎస్పీ సెంథిల్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేయాలని తంజావూర్‌ నగర జాయింట్‌ పోలీసు సూపరింటెండెంట్‌కు పంపారు. అనంతరం పోలీసు సీఐ జ్యోతి మహాలింగం ఇరువర్గాల వారిని పోలీసు స్టేషన్‌కి పిలిపించి విచారణ చేశారు. రూ.1 లక్షతో ఇంకొక దస్తావేజుని చంద్ర వద్ద ఇవ్వాలని అంథోని వద్ద పలికాడు. చంద్ర వద్ద కుదువపెట్టిన 4 దస్తావేజులను సీఐ తీసుకున్నాడు. ఈ పత్రాలను తీసుకున్నట్లు అంథోని స్వామి వద్ద ఓ పేపర్‌పై సంతకం తీసుకున్నాడు. కానీ ఆ పత్రాలను అతనికి అప్పగించలేదు. పత్రాలు అడిగిన ఆంథోని స్వామిని తంజావూర్‌ పాత బస్టాండ్‌ సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌(రూం నంబర్‌105)కి వచ్చి తీసుకొమ్మని సీఐ చెప్పాడు.

దీంతో అక్కడికి వెళ్లిన అంథోని స్వామి సీఐని కలిశాడు. అప్పుడు అతను, పత్రాలను ఇవ్వడానికి లంచం కోరాడు. అంథోని స్వామి తన వద్ద ఉన్న రూ.50 వేల నగదు ఇచ్చాడు. దాన్ని తీసుకున్న సీఐ ఒక పత్రం మాత్రం ఇచ్చాడు. ఇంకా 3 పత్రాలు కావాలంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని అడిగాడు. లంచం ఇవ్వటానికి ఇష్టపడని అంథోని స్వామి తంజావూర్‌ సీబీఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీబీఐ పోలీసులు అతని కదలికలు పర్యవేక్షించారు. శుక్రవారం తంజావూర్‌ పోలీసుస్టేషన్‌కి లంచం నిషేధ పోలీసులు వెళ్లి అక్కడ పనుల్లో ఉన్న పోలీసుల వద్ద విచారణ చేశారు. అప్పడు అంథోని స్వామి కుదువ పెట్టిన పత్రాలను సీఐ జ్యోతి మహాలింగం తీసుకున్నట్లు, దాన్ని అతనికి అప్పగించకుండానే సంతకం తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం సీఐ నివసించిన గదికి సీల్‌ వేశారు. సీఐ జ్యోతి మహాలింగంపై సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement