టీఆర్ఎస్ వరంగల్ సభను 16 ఏళ్ల ప్రగతి నివేదన సభ అనేకంటే అధికార ఆరాట ఆవేదన సభ అనాలి అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.
అది అధికార ఆరాట ఆవేదన సభ: పొన్నాల
Apr 28 2017 2:17 PM | Updated on Aug 14 2018 11:02 AM
హైదరాబాద్: టీఆర్ఎస్ వరంగల్ సభను 16 ఏళ్ల ప్రగతి నివేదన సభ అనేకంటే అధికార ఆరాట ఆవేదన సభ అనాలి అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. మరోసారి అధికారం కోసం ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఆయనిక్కడ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రసంగం పేలవంగా ఉందని.. ప్రజలలోనూ స్పందన లేదని అన్నారు. ఉస్మానియా శత వసంతాల సంబరాలకు రాష్ట్రపతి రావడం గర్వకారణం అయితే తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే అవకాశం తీసుకోకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. మరోవైపు భూసేకరణ చట్టం 2013 అమలు చేయకుండా కొత్త చట్టం తెస్తే కేంద్రం నుండి తిరిగి పంపారు.. ఇది ఆయన పరిపాలనకు అద్దం పడుతోందన్నారు.
144వ సెక్షన్ విధించి బలవంతంగా భూసేకరణ చేస్తే కోర్టు స్టేలు ఇస్తోందని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కోర్టు అభ్యంతరాలు చెప్పిందన్నారు. వరంగల్ సభ కన్నా 48 గంటల ముందు ఈ సంఘటనలు జరిగాయని, ఆ భయంతో పేలవంగా మాట్లాడారని అన్నారు. మీ వాళ్ళు గంటలు కూలి చేస్తే లక్షలు వస్తాయి కానీ ఉపాధి హామీ కూలీలకు మూడు నెలలు అయినా 150 రూపాయలు ఇవ్వరా అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి తూతూ మంత్రంగా ఇచ్చారు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏమైంది..ఎక్కడ మొదలుపెట్టారు.. ఎక్కడ ఇచ్చారు.. మీ బడ్జెట్ కేటాయింపు ఎంత.. ఇవ్వి మోసపూరిత మాటలు కాదా అని నిలదీశారు. మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మాట్లాడని కేసీఆర్ వారికి ఎరువుల ఆశ చూపుతున్నారన్నారు. కాంగ్రెస్ను నిందించకుండా కేసీఆర్కు రోజు గడవదన్నారు. తెలంగాణ ద్రోహుల సంగతి చూస్తానంటారు.. మరి మీ కేబినెట్లో ఎవరున్నారు.. మీరు ఎవరికి టిక్కెట్లు ఇచ్చారో ప్రజలకు తెలియదా అని పొన్నాల ప్రశ్నించారు.
Advertisement


