చెన్నైలో పెరిగిన కాలుష్యం | Pollution Percentage Rises in Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో పెరిగిన కాలుష్యం

Nov 8 2019 10:03 AM | Updated on Nov 8 2019 10:03 AM

Pollution Percentage Rises in Chennai - Sakshi

పొగ మంచు

సాక్షి, చెన్నై: చెన్నైలో గురువారం కాలుష్యం మరింత పెరిగింది. పొగ మంచు కప్పేసినట్లుగా పరిస్థితి మారింది. వాహన చోదకులకు తంటాలు తప్పలేదు. ఈశాన్య రుతుపవనాల రాకతో వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. సరాసరిగా 20 సె.మీ మేరకు వర్షం పడింది. తదుపరి కనుమరుగైంది. బంగాళాఖాతంలో ద్రోణులు బయలుదేరినా, తుపానులుగా మారినా వాటి ప్రభావం తమిళనాడు మీద ఏ మాత్రం కనిపించలేదు. ఈ ఏడాది ఈశాన్యంతో వర్షాలు ఆశాజనకంగానే ఉంటాయని వాతావరణ కేంద్రం తొలుత ప్రకటించినా పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. వర్షాలు కనుమరుగయ్యేనా..?అన్న పరిస్థితి నెలకొంది. ఇందుకుకారణం కాలుష్యం పెరిగినట్లుగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

ప్రధానంగా చెన్నై నగరంలో కాలుష్యమన్నది మరింతగా పెరిగి ఉన్నది. ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు ఆవహించి ఉండడంతో వాహన చోదకులకు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళలో సైతం ఆకాశాన్ని పొగ కమ్మేసినట్లుగా పరిస్థితి నెలకొనడంతో వాహన చోదకులు వాహనాలకు లైట్లు వేసుకుని ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో బంగాళాఖాతంలో బయలుదేరిన బుల్‌ బుల్‌ తుపాను ఒడిశా వైపుగా కదిలింది.  తమిళనాట వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉపరితల ఆవర్తనం రూపంలో దక్షిణాదిలోని ఇతర జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు మాత్రం పలకరిస్తున్నాయి. అయితే, రానున్న వేసవిలో నీటి ఎద్దడిని మళ్లీ ఎదుర్కోకుండా ఉండాలంటే మరింతగా వర్షాలు పడాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement