పాపం.. పెద్దాయన!
ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా దశాబద్ధాల పాటు పనిచేసిన ఆయన.. తన కార్యక్షేత్రం అసెంబ్లీలో ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెన్నై: తమిళనాడు రాజకీయ చరిత్రలో తనదంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు డీఎంకే చీఫ్ కరుణానిధి. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా దశాబద్ధాల పాటు పనిచేసిన ఆయన.. తన కార్యక్షేత్రం అసెంబ్లీలో ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లుగా వీల్ చైర్ కే పరిమితమైన కరుణానిధి.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే వీలు లేకుండాపోయింది. ఇందుకు మొదటికారణం అమ్మ జయలలిత ప్రభుత్వ తీరు కాగా, రెండో కారణం ఆయన ఆయన కుమారుడు స్టాలిన్.
గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కరుణానిధికి కేబినెట్ హోదా ఉండేది. అంతేకాక సభలో ఆయన కూర్చునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయించింది. అయితే ప్రస్తుత సభలో డీఎంకే కోశాధికారి, కరుణ చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్ పక్షానికి నాయకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీ నేతకు తప్ప మిగతవారికి అదనపు సౌకర్యాలు లభించవు. అయితే కరుణానిధి పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిందేనని డీఎంకే డిమాండ్ చేస్తోంది.
శుక్రవారం ఉదయం అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన స్టాలిన్.. కరుణానిధికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని స్పీకర్ ధనపాల్ ను గతంలోనే కోరామని గుర్తుచేశారు. డీఎంకే అభ్యర్థనను పరిగణలోకి తీసుకోకుండా సీనియర్ నేతకు రెండో వరుసలో సీటు కేటాయించారని ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. ఇప్పటికైనా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు సభలో గడగడలాడించిన కరుణానిధికి ప్రస్తుతం ఎదురవుతోన్న సమస్యలను తలుచుకుని బాధతో 'పాపం పెద్దాయన' అనుకుంటున్నారట ఆయన అభిమానులు.


