మిల్లు స్థలాల్లో నిర్మించనున్న ఇళ్ల ధరలు ప్రభుత్వం ఏకంగా మూడు రెట్లు పెంచేసి పేద కార్మికుల నడ్డి విరిచింది.
సాక్షి, ముంబై: మిల్లు స్థలాల్లో నిర్మించనున్న ఇళ్ల ధరలు ప్రభుత్వం ఏకంగా మూడు రెట్లు పెంచేసి పేద కార్మికుల నడ్డి విరిచింది. ఇంతకు ముందు తక్కువ మొత్తంలో లభించిన ఇళ్లు ఇప్పుడు ఏకంగా మూడింతలు అవ్వడంతో ఏమి చేయాలో కార్మికులకు తోచడం లేదు. ఇటు ఇల్లును వదులుకోలేక, అటు ఆ మొత్తాన్ని చెల్లించలేక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితం కాలాచౌకి, ప్రభాదేవి ప్రాంతాల్లోని మిల్లు స్థలాల్లో మాడా నిర్మించిన 6,925 ఇళ్ల ధరలు రూ.7.50 లక్షలు కేటాయించింది. అర్హులైన కార్మికులను ఎంపిక చేసి లాటరీలో పేరు వచ్చిన వారికి విక్రయించింది.
ఇప్పుడు తాజాగా నిర్మించబోయే ఇళ్ల ధరలు ఏకంగా రూ.20 లక్షలుగా నిర్ణయించింది. దీంతో మిల్లు కార్మికులు, వారి వారసులు ఈ మొత్తాన్ని ఎలా చెల్లించేదని ఆందోళన చెందుతున్నారు. గత శనివారం సాయంత్రం వర్లీలోని సెంచురీ మిల్లులో కార్మికుల ఇళ్ల ప్రాజెక్ట్కు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ భూమిపూజ చేసిన సంగతి విదితమే. కేవలం రెండేళ్ల కాలంలోనే ఏకంగా మూడు రేట్లు పెంచేయడమేంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పాత ధరకే ఇళ్లు అందజేయడం గిట్టుబాటు కాదని మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా) ఉపాధ్యక్షుడు సతీష్ గవయి స్పష్టం చేశారు. ప్రస్తుతం మాడా వాటి ధరలను పెంచినా, మార్కెట్తో పోలిస్తే ఈ ఇళ్ల ధరలు చాలా చౌకేనని ఆయన అన్నారు. ‘ఈ ఇళ్ల కోసం బ్యాంకుల ద్వారా 90 శాతం రుణాలు సమకూరుస్తున్నాం.
వీటిని కొనుగోలు చేయడానికి మిల్లు కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావ’ని గవయి స్పష్టం చేశారు. కానీ మాడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని మిల్లు కార్మికుల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇళ్ల నిర్మాణం కోసం మిల్లు యజమానులు మాడాకు ఉచితంగా స్థలం అందజేశారు. దీంతో మార్కెట్ చదరపు అడుగుల ధరలు ఇక్కడ వర్తించవని సంఘాలు అంటున్నాయి. కేవలం నిర్మాణ ఖర్చులు తీసుకోవాలని కోరుతున్నాయి. మొదటి విడతలో నిర్మించిన ఇళ్ల ధరలు రూ.7.50 లక్షలు ఉండగా, రెండో విడతలో నిర్మించే ఇళ్ల ధరలు రూ.12.50 లక్షలుగా ఉంటాయని మాడా గత సంవత్సరం ప్రకటించింది. పైగా ఈ పథకంలో నిర్మించే ఒక్కో ఇల్లుకు కేంద్రం రూ.రెండు లక్షలు రాయితీ కూడా ప్రకటించింది.
వివిధ పన్నులు మాఫీ చేసి కార్మికులకు రూ.7.50 లక్షలకే ఇల్లు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది. అయితే ఇలా మూడు రెట్లు ధరలు పెంచడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మిల్లులు మూతపడడంతో అనేక కుటుంబాలు ఇప్పటికే రోడ్డున పడ్డాయి. రూ.20 లక్షలు కాదుగదా ముందుగా నిర్ణయించిన రూ.12.50 లక్షలు కూడా చెల్లించే స్థితిలో లేరని నాయకులు వాదిస్తున్నారు. ధరలపై సీఎం చవాన్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయనున్నట్లు కార్మిక నాయకుడు దత్తా ఇస్వాల్కర్ చెప్పారు.
తెలుగు కార్మికుల అసంతృప్తి
మాడా ఒక్కసారే మిల్ల స్థలాల్లో నిర్మించే ఇళ్ల ధరలను మూడింతలు చేయడంపై తెలుగు కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో నిరర్మించిన ఇళ్లను రూ.7.50 లక్షలకు చెల్లించిన మాడా అధికారులు భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయన్న సాకుతో ఏకంగా రూ.20 లక్షలకు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో చెల్లించాలంటే కార్మికులందరికీ ఇబ్బంది కలిగించే అంశమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాడా తీరుపై వారు మండిపడుతున్నారు.