నేర చరితులకు నో ఎంట్రీ | Madras High Court Asks Bar Council to Abolish 3 Year Law Degree Courses | Sakshi
Sakshi News home page

నేర చరితులకు నో ఎంట్రీ

Oct 7 2015 2:58 AM | Updated on Oct 8 2018 3:56 PM

ప్రజల సమస్యలను చట్టపరంగా పరిష్కరించే న్యాయవాదులే సమస్యలో పడ్డారు. నేరచరితులకు బార్ కౌన్సిల్‌లోకి ప్రవేశం లేదంటూ మద్రాసు హైకోర్టు

 బార్ కౌన్సిల్‌లో నేరచరిత
 న్యాయవాదులకు సభ్యత్వం ఇక కష్టమే
 మూడేళ్ల లా పట్టాపై నిషేధం కోసం కమిటీ
 మద్రాసు హైకోర్టు తీర్పు
 లా కోర్సులో ప్రవేశానికి పోలీస్ సర్టిఫికెట్ తప్పనిసరి

 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజల సమస్యలను చట్టపరంగా పరిష్కరించే న్యాయవాదులే సమస్యలో పడ్డారు. నేరచరితులకు బార్ కౌన్సిల్‌లోకి ప్రవేశం లేదంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు కొందరు న్యాయవాదులను ఇరకాటంలో పెట్టింది. అలాగే మూడేళ్ల న్యాయశాస్త్రం పట్టాపై నిషేధం విధించేలా ఒక క మిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
 
 పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని న్యాయవాదుల చట్టంలో మార్పులు చేయాలని, అంతవరకు బార్ కౌన్సిల్ ఎన్నికలను వాయిదా వేయాలని తదితర సంచలన తీర్పులను చెప్పింది. మూడేళ్ల, ఐదేళ్ల న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నవారు బార్ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని పొందుతున్నారు. ఈ విధానంపై వచ్చిన అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి కృపాకర న్ కొంతకాలంగా సాగుతున్న విచారణను పూర్తిచేసి మంగళవారం తీర్పు చెప్పారు. క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాదులు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా తమ పేర్లను నమోదు చేసుకోరాదని నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో పట్టా పుచ్చుకున్న న్యాయవాదులు తమిళనాడు బార్ కౌన్సిల్‌లో పేర్లను నమోదు సమయంలో సర్టిఫికేట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు.
 
  ప్రస్తుతం మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సులు అమలులో ఉన్నాయి, ఇకపై ఐదేళ్ల కోర్సులు మాత్రమే ఉండేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి నేతృ త్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని లా కోర్సుల చట్టంలో మార్పులు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని చెప్పారు. అలాగే లా కోర్సులో ప్రవేశించేందుకు విద్యార్థులు తమ నడవడికపై పోలీసు సర్టిఫికెట్ తప్పనిసరిగా జత చేసేలా మార్పులు తీసుకురావాలని చెప్పారు. ఈ మార్పులు జరిగే వరకు తమిళనాడు బార్ కౌన్సిల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశించారు.
 
 న్యాయవాదిగా 20 ఏళ్ల అనుభవం ఉన్నవారే బార్ కౌన్సిల్‌కు పోటీచేయాలని, క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని బార్ కౌన్సిల్ ఎన్నికలను అనుమతించరాదని తీర్పులో పేర్కొన్నారు. రిటైర్డు న్యాయమూర్తి కమిటీలో పోలీసులు, మేధావులు సభ్యులుగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని విరమించిన వారు న్యాయవాదులుగా ప్రాక్టీసు చేయడాన్ని అనుమతించరాదని న్యాయమూర్తి తన తీర్పులో కోరారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement