ఛిద్రమవుతున్న బాల్యం | Global March Against Child Labour | Sakshi
Sakshi News home page

ఛిద్రమవుతున్న బాల్యం

Nov 19 2014 10:38 PM | Updated on Sep 2 2017 4:45 PM

నగర శివారు ప్రాంతాల్లోని పరిశ్రమల్లో బాల్యం మగ్గిపోతోంది. వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను నగరానికి తరలిస్తున్న ఏజెంట్లు, వారిని శివారులో వెలసిన

 నగర శివారు ప్రాంతాల్లోని పరిశ్రమల్లో బాల్యం మగ్గిపోతోంది. వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను నగరానికి తరలిస్తున్న ఏజెంట్లు, వారిని శివారులో వెలసిన చిన్న పరిశ్రమలకు అప్పగించి అందినకాడికి దండుకొంటున్నారు. ఇదే అదనుగా భావించిన యాజమాన్యాలు అతితక్కువ వేతనాలతో పనిచేయిస్తూ చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకొనే దిక్కు లేకపోవడంతో బాల్యం ఛిద్రమవుతోంది.
 
 సాక్షి, న్యూఢిల్లీ:  దేశరాజధానిలో బాలకార్మిక వ్యవస్థ ఊడలు వేస్తోంది. ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నగరంలో బాలకార్మికులుగా, చెత్తనేరుకునేవారిగా జీవితాన్ని వెల్లదీస్తోన్న పిల్లల సంఖ్య సుమారు 28 లక్షలు ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి. జహంగీర్‌పురి, మంగోల్‌పురి, తుగ్లకాబాద్, రంగ్‌పురి పహాడీ, భల్సా డైరీ  గోవింద్‌పురి తదితర ప్రాంతాల్లోని చిన్నచిన్న పరిశ్రమల్లో అధిక సంఖ్యలో బాలకార్మికులుగా పనిచేస్తున్నారు.  బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒరిస్సా, నేపాల్‌ల నుంచి వచ్చిన చిన్నారులే అధికంగా ఉన్నారు. వీరిని సాధారణంగా ఆయా ప్రాంతాలకు చెందిన ఏజెంట్లు చిన్నారులను ఢిల్లీకి తరలిస్తుంటారు. అనధికార కాలనీలు, మురికివాడల్లో తలల్లిదండ్రులతో పాటు నివసించే పిల్లలు కూడా ఈ పరిశ్రమల్లో పనిచేస్తుంటారు.
 
 శివారు ప్రాంతాల్లోని పరిశ్రమల్లో..
 నగర శివారు ప్రాంతాల్లో వెలసిన చిన్న పరిశ్రమలు బాలకార్మిక వ్యవస్థను పెంచిపోషిస్తున్నాయి. జరీ తయారీ, గాజుల తయారీ,  షూస్, పర్సులు,  బెల్టుల వంటి చర్మ ఉత్పత్తుల పరిశ్రమల్లో అత్యధికంగా బాలకార్మికులు పనిచేస్తున్నారు. మెటాలిక్, గ్లాస్ గాజులకు ఖరీదైన దుకాణాల్లోఅధిక డిమాండ్ ఉంటోంది. ఈ రకం గాజులు  తయారుచేసే పరిశ్రములు పిల్లలనే ఎక్కువగా పనిలో పెట్టుకుంటున్నాయి.  ఈ పరిశ్రమల్లో  6 నుంచి 13 ఏళ్ల వయస్సున్న పిల్లలను 10 నుంచి 12 గంటల పాటు పనిచేయిస్తుంటారు. ఇది పిల్లల ఆరోగ్యానికి హానిక రమని తెలిసినా పట్టించుకొనే దిక్కులేదు.
 
 పోలీసులతో మిలాఖత్..
 పిల్లలతో పనిచేయించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం ఈ పరిశ్రమల నిర్వాహకులు పోలీసులతో పాటు సామాజిక కార్యకర్తలకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టచెబుతుంటారనే ఆరోపణలు ఉన్నాయి. బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలన పట్ల అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడంతో రోజురోజుకూ ఈ సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కార్మిక శాఖ వీరి గురించి పట్టించుకొన్న దాఖలాలే లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement