బీజేపీ సీనియర్ నేత ఇలగణేషన్కు ఎట్టకేలకు సముచిత స్థానాన్ని కేంద్రం కల్పించింది. మధ్యప్రదేశ్ ఉంచి రాజ్యసభకు ఆయన ఏకగ్రీవంగా
సాక్షి, చెన్నై: బీజేపీ సీనియర్ నేత ఇలగణేషన్కు ఎట్టకేలకు సముచిత స్థానాన్ని కేంద్రం కల్పించింది. మధ్యప్రదేశ్ ఉంచి రాజ్యసభకు ఆయన ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో మద్దతు దారుల్లో ఆనందం వికసించింది. శుక్రవారం చెన్నైకు రానున్న ఇలగణేషన్కు ఘనస్వాగతం పలికేందుకు కమలనాథులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర బీజేపీలో సీనియర్ నేతగా ఇలగణేషన్ ఉన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా, కొంత మేరకు తన బలాన్ని చాటుకున్నారు. మంచి వాక్చాతుర్యం కల్గిన నేతగా బీజేపీలో ఉన్నా, అధికారంలోకి వచ్చాక ఆయనకు సముచిత న్యాయం దక్కలేదన్న ఆవేదనను పలువురు కమలనాథులు వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఎట్టకేలకు ఆయనకు సముచిత స్థానం కల్పించే విధంగా బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపించేందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు మధ్య ప్రదేశ్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల గడవు ముగియడం, పోటీ అన్నది లేని దృష్ట్యా, ఇలగణేషన్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఏకగ్రీవ ఎంపిక సర్టిఫికెట్ను గురువారం అక్కడి అధికారుల నుంచి ఇలగణేషన్ అందుకుని, ఇక ఎంపీగా తమిళనాట అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఎంపీగా పదవి దక్కిన దృష్ట్యా, కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా వరించవచ్చన్న ప్రచారం ఊపుందుకుంది. ఇక, ఎంపీగా చెన్నైలో అడుగు పెట్టనున్న తమ నేతకు ఘనస్వాగతం పలికేందుకు తగ్గ ఏర్పాట్లలో ఇలగణేషన్ మద్దతు దారులు, రాష్ట్ర పార్టీ వర్గాలు చర్యలు చేపట్టి ఉన్నాయి. పార్టీ నాయకులు డాల్ఫిన్ శ్రీధర్, వేదసుబ్రమణియన్, శివలింగం, గుణాల నేతృత్వంలో మీనంబాక్కం వద్ద ఘన స్వాగతానికి తగ్గ ఏర్పాట్లు చేశారు.