కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అది సాధ్యం కాని పక్షంలో వచ్చే రాష్ట్రపతి పాలన వల్ల ఎదురయ్యే పరిస్థితులను కూడా సమీక్షిస్తున్నారు.
రాష్ట్రపతి పాలన తప్పదా?
Dec 12 2013 11:21 PM | Updated on Mar 29 2019 6:00 PM
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అది సాధ్యం కాని పక్షంలో వచ్చే రాష్ట్రపతి పాలన వల్ల ఎదురయ్యే పరిస్థితులను కూడా సమీక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలి, రెండు స్థానాల్లో నిలిచిన బీజేపీ, ఆప్లు ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా లేకపోవడంతో ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నజీబ్ జంగ్ గురువారం ఉదయం రాజ్నివాస్లో విభిన్న ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి పాలన వస్తే అధికారులదే ప్రధానపాత్ర ఉండనుండటంతో వారికి మార్గదర్శనం చేసేందుకే ఈ భేటీలు జరుగుతున్నాయని సమాచారం.
లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి దీపక్ మోహన్ స్పోలియా నేతత్వంలో అధికారుల బృందాలే వివిధ ప్రభుత్వ విభాగాలను నడుపుతూ ప్రజాహిత పథకాల అమలును కొనసాగిస్తారు. అలాగే గత రెండు నెలలుగా ఢిల్లీలో ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచి పోయిన పనులపై కూడా దృష్టి సారించనున్నారు. నజీబ్ ఆధ్వర్యంలో బడ్జెట్ రూపొం దిస్తారు. పార్లమెంటు దానిని ఆమోదిస్తుంది. ఢిల్లీలో రాష్ట్రపతిపాలన విధిస్తే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఇంటికే పరిమితం కానున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఫిబ్రవరి నుంచి మరోసారి ఎన్నికల ప్రవర్తనా నియమాళి అమలులోకి వచ్చే అవకాశముందని రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నాయి.
Advertisement


