
ఆశల పల్లకిలో...
పతకాలే లక్ష్యంగా ఏకకాలంలో భారత పురుషుల, మహిళల చెస్ జట్లు ప్రపంచ టీమ్ చాంపియన్షిప్లో బరిలోకి దిగుతున్నాయి.
నేటి నుంచి ప్రపంచ చెస్ టీమ్ చాంపియన్షిప్
న్యూఢిల్లీ: పతకాలే లక్ష్యంగా ఏకకాలంలో భారత పురుషుల, మహిళల చెస్ జట్లు ప్రపంచ టీమ్ చాంపియన్షిప్లో బరిలోకి దిగుతున్నాయి. పురుషుల టీమ్ చాంపియన్షిప్ ఆర్మేనియాలో... మహిళల టీమ్ చాంపియన్షిప్ చైనాలో ఆదివారం ప్రారంభం కానున్నాయి. తెలుగు గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ, కృష్ణన్ శశికిరణ్, సేతురామన్, విదిత్ షంతోష్ గుజరాతి, దీప్ సేన్గుప్తాలతో కూడిన భారత పురుషుల జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మొత్తం పది జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడనున్న ఈ పోటీల్లో భారత్తోపాటు ఆర్మేనియా, చైనా, రష్యా, క్యూబా, ఈజిప్టు, హంగేరి, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, అమెరికా జట్లు పాల్గొంటున్నాయి. గతేడాది చెస్ ఒలింపియాడ్లో కాంస్యం సాధించినందుకు భారత జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించింది. తెలుగు గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్గోమ్స్లతో కూడిన భారత మహిళల జట్టుకు ‘వైల్డ్ కార్డు’ కేటాయించడంతో ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. చైనా, రష్యా, ఆర్మేనియా, జార్జియా, అమెరికా, పోలండ్, ఈజిప్టు, ఉక్రెయిన్, కజకిస్థాన్ కూడా ఈ టోర్నీలో ఆడనున్నాయి. అత్యధిక పాయింట్లు సాధించిన తొలి మూడు జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందజేస్తారు.
భారత మహిళలకు హాకీలో మరో ఓటమి
న్యూఢిల్లీ: హాక్స్ బే కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు మరో ఓటమి ఎదురైంది. అమెరికాతో శనివారం జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్లో టీమిండియా 0-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. దాంతో ఆదివారం భారత జట్టు ఏడు, ఎనిమిది స్థానాల కోసం జరిగే మ్యాచ్లో జపాన్తో ఆడుతుంది.