
పేస్ అవకాశాలు సంక్లిష్టం
రికార్డు స్థాయిలో వరుసగా ఏడో ఒలింపిక్స్లో పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ .....
► ఒలింపిక్స్లో వైల్డ్ కార్డ్లను తొలగించిన ఐఓసీ
► ర్యాంకింగ్ ఆధారంగానే అర్హత
న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో వరుసగా ఏడో ఒలింపిక్స్లో పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఆశలకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కొత్త నిబంధన అడ్డంకిగా మారనుంది. 2016 రియో ఒలింపిక్స్ టెన్నిస్ విభాగంలో ఎలాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను అనుమతించరాదని ఐఓసీ నిర్ణయించింది. దీని ప్రకారం భారత ఆటగాళ్లకు తమ ర్యాంకింగ్స్ ఆధారంగానే అవకాశం లభిస్తుంది. గతంలో ఆటగాళ్ల గత రికార్డు, ఒలింపిక్స్లో వారి ప్రదర్శన తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏదైనా దేశం వైల్డ్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తే ఒలింపిక్ కమిటీ తమ విచక్షణ మేరకు వారిని అనుమతించేది. ‘
ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్లో వైల్డ్ కార్డ్లు ఇవ్వడం లేదు. ఆటగాళ్లందరూ ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం అర్హత సాధించాల్సిందే. కాబట్టి ఏ దేశానికి చెందిన టెన్నిస్ సంఘం కూడా వీటి కోసం దరఖాస్తు చేయవద్దు’ అని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రధాన కార్యదర్శి యువాన్ మార్గెట్స్ స్పష్టం చేశారు.
బోపన్న పరిస్థితి మెరుగు...
రియో ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో 24 జోడీలకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. టాప్-10 ర్యాంకింగ్స్లో ఉన్న ఆటగాడికి అర్హత లభించడంతో పాటు తన భాగస్వామిని ఎంచుకునే అవకాశం కూడా దక్కుతుంది. ఇందు కోసం జూన్ 6 కటాఫ్ తేదీగా నిర్ణయించారు. అప్పటి వరకు ఉండే ర్యాంకులను బట్టే ఎంపిక జరుగుతుంది. ప్రస్తుతం రోహన్ బోపన్న ప్రపంచ ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో ఉన్నాడు. రాబోయే టోర్నీల్లో మెరుగ్గా ఆడితే టాప్-10లోకి చేరుకోవడం కష్టం కాకపోవచ్చు. కానీ పేస్ ఏకంగా 52వ ర్యాంక్లో ఉన్నాడు. ఇటీవల అతను వరుసగా విఫలమవుతున్నాడు. కాబట్టి మెరుపు వేగంతో ర్యాంక్ సాధించడం అంత సులువు కాదు.
ఇక చాలా కాలంగా పోటీలకు దూరంగా ఉంటున్న మహేశ్ భూపతి (214)కి కూడా దాదాపుగా అవకాశాలు లేనట్లే. తుది గడువులోపు బోపన్న టాప్-10లో నిలిచి తన భాగస్వామిగా పేస్ను ఎంచుకుంటే ఈ స్టార్ ప్లేయర్ను ఒలింపిక్స్లో చూడొచ్చు.