చెన్నై స్మాషర్స్‌కు మూడో విజయం | Third victory for Chennai Smashers | Sakshi
Sakshi News home page

చెన్నై స్మాషర్స్‌కు మూడో విజయం

Jan 9 2018 12:45 AM | Updated on Aug 20 2018 9:35 PM

Third victory for Chennai Smashers - Sakshi

చెన్నై: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై స్మాషర్స్‌ జట్టు మూడో విజయం సాధించి ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో తమ సెమీఫైనల్‌ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. బెంగళూరు బ్లాస్టర్స్‌తో సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్‌ 3–2తో గెలుపొందింది. రెండు ‘ట్రంప్‌’ మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఆటగాళ్లే నెగ్గడం విశేషం. బెంగళూరు ‘ట్రంప్‌’ మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి–లీ యాంగ్‌ (చెన్నై) జంట 8–15, 15–14, 15–13తో బో మథియాస్‌–కిమ్‌ సా రంగ్‌ జోడీపై గెలిచింది.

ఆ తర్వాత చెన్నై ‘ట్రంప్‌’ మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 15–9, 15–14తో కిర్‌స్టీ గిల్మోర్‌ (బెంగళూరు)పై గెలిచింది. దాంతో చెన్నై 3–(–1)తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో అక్సెల్‌సన్‌ (బెంగళూరు) 15–11, 6–15, 15–9తో సెన్‌సోమ్‌బున్‌సుక్‌పై... శుభాంకర్‌ (బెంగళూరు) 15–12, 15–12తో లెవెర్‌డెజ్‌పై... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–కిమ్‌ సా రంగ్‌ (బెంగళూరు) 15–14, 15–11తో సింధు–క్రిస్‌ అడ్‌కాక్‌లపై గెలిచినా ఫలితం లేకపోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement