సుతీర్థ ముఖర్జీ ‘డబుల్‌ ధమాకా  | Sutirtha Mukherjee Wins Two Titles Of Senior Table Tennis | Sakshi
Sakshi News home page

సుతీర్థ ముఖర్జీ ‘డబుల్‌ ధమాకా 

Feb 3 2020 10:07 AM | Updated on Feb 3 2020 10:07 AM

Sutirtha Mukherjee Wins Two Titles Of Senior Table Tennis - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో హరియాణా క్రీడాకారిణి సుతీర్థ ముఖర్జీ సత్తా చాటింది. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ టోరీ్నలో మహిళల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచి ఆమె రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో హర్మీత్‌ దేశాయ్‌ (పీఎస్‌పీబీ) చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ (హరియాణా) 11–4, 11–5, 11–8, 11–4తో క్రితిక సిన్హా రాయ్‌ (పీఎస్‌పీబీ)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో హర్మీత్‌ దేశాయ్‌ 11–4, 11–13, 14–12, 9–11, 11–8, 5–11, 11–5తో మానవ్‌ ఠక్కర్‌ (పీఎస్‌పీబీ)ని ఓడించాడు. 

అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో మానవ్‌ ఠక్కర్‌ 11–9, 16–14, 7–11, 15–13, 6–11, 11–9తో జి. సత్యన్‌ (పీఎస్‌పీబీ)పై, హరీ్మత్‌ దేశాయ్‌ 11–9, 11–7, 11–4, 8–11, 14–12తో సౌమ్యజిత్‌ ఘోష్‌ (హరియాణా)పై గెలుపొందారు. సెమీస్‌లో ఓడిన సత్యన్, సౌమ్యజిత్‌లకు కాంస్యాలు లభించాయి. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో సుతీర్థ 12–10, 8–11, 11–9, 11–5, 11–5తో ఐహిక ముఖర్జీ (ఆర్‌బీఐ)ని, క్రితిక సిన్హా రాయ్‌ 11–9, 11–6, 15–13, 11–7తో అంకిత దాస్‌ (బెంగాల్‌)ని ఓడించారు. సెమీస్‌లో ఓడిన ఐహిక, అంకిత దాస్‌ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళల డబుల్స్‌ ఫైనల్లో సుతీర్థ–రితి శంకర్‌ (హరియాణా) ద్వయం 11–7, 11–7, 8–11, 11–8తో సురభి పటా్వరీ–పోమంతీ బైస్యా (బెంగాల్‌) జోడీపై గెలుపొందగా... పురుషుల డబుల్స్‌ తుదిపోరులో జుబిన్‌ కుమార్‌–సౌమ్యజిత్‌ ఘోష్‌ (హరియాణా) జంట 11–7, 8–11, 11–3, 11–7తో మనుశ్‌ షా–ఇషాన్‌ హింగోరాణి (గుజరాత్‌) జోడీని ఓడించి చాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకున్నాయి. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో రోనిత్‌ భాంజా–మౌసుమీ పాల్‌ (బెంగాల్‌) 15–13, 8–11, 12–10, 13–11తో సౌరవ్‌ సాహా–సుతీర్థ ముఖర్జీ (హరియాణా) జంటపై నెగ్గింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమలో తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్‌’ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, భారత టేబుల్‌ టెన్నిస్‌ సంఘం (టీటీఎఫ్‌ఐ) కార్యదర్శి ఎంపీ సింగ్, తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ సంఘం (టీఎస్‌టీటీఏ) అధ్యక్షులు ఎ. నరసింహారెడ్డి, కార్యదర్శి పి. ప్రకాశ్‌ రాజు పాల్గొన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement