‘ధోనీపై గంగూలీ మాటలు ఇంకా గుర్తున్నాయి..’

Sourav Ganguly predicted Dhoni feature says Joy Bhattacharya - Sakshi

న్యూఢిల్లీ : మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించడంలో భారత మాజీ​ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్ గంగూలీ చేసిన ఎనలేని కృషిని కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య నెమరు వేసుకున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ గొప్ప స్టార్‌ అవుతాడాని గంగూలీ ముందే పసిగట్టాడని జాయ్ భట్టాచార్య తెలిపాడు. ధోనీ వీఐపీ అవుతాడని తనతో అన్నాడని గౌరవ్ కపూర్ యూట్యూబ్ షోలో జాయ్‌ భట్టాచార్య మాట్లాడుతూ గుర్తు చేసుకున్నాడు. భారత్‌ ఏ, పాకిస్తాన్‌ ఏ, బంగ్లాదేశ్‌ ఏ త్రైపాక్షిక సిరీస్‌ అనంతరం 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన ధ్వైపాక్షిక సీరీస్‌కు ధోనీ తొలిసారిగా ఆడాడు. 2004లో బంగ్లాదేశ్‌‌కు వెళ్లే విమానంలో గంగూలీ తనతో చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయని జాయ్‌ అన్నాడు. ధోనీని చూపిస్తూ..'మనకు ఓ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఉన్నాడు. అతను భవిష్యత్తులో గొప్ప స్టార్ అవుతాడు' అని దాదా చెప్పాడని జాయ్‌ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. గంగూలీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆటగాళ్ల ప్రతిభను పసిగట్టడం. ప్లేయర్ టాలెంట్ అతను గుర్తించాడంటే, ఆ ఆటగాడు విఫలమైనా అతనికి అండగా ఉంటాడు. ఎందుకంటే టాలెంట్ ఉన్న ఆటగాళ్లు రాణిస్తారని అతని గట్టి నమ్మకం' అని భట్టాచార్య చెప్పుకొచ్చాడు.(ఐపీఎల్‌పై కేంద్రానికి లేఖ రాసిన బీసీసీఐ)

భారత జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో సారథిగా పగ్గాలు అందుకున్న సౌరవ్ గంగూలీ భారత క్రికెట్‌లో ఓ నూతన అధ్యయాన్ని లిఖించాడు. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ వంటి ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసి బలమైన జట్టుగా భారత్‌ను నిలిపాడు. ఇక 2004 బంగ్లాదేశ్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనీ, ఆ టూర్‌లో విఫలమైనా గంగూలీ అవకాశం ఇచ్చాడు. ఆ టూర్ అనంతరం స్వదేశంలో విశాఖలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇవ్వడంతో మహీ సత్తా ప్రపంచానికి తెలిసింది. ఆ మ్యాచ్‌లో ధోనీ విధ్వంసకర బ్యాటింగ్‌తో 123 బంతుల్లో 148 పరుగులు చేసి వీరవిహారం చేశాడు. అనంతరం ధోనీ క్రికెట్‌ ప్రయాణం తెలిసిందే. (ఆస్ట్రేలియాలో జరిగితే ఆ టికెట్లు చెల్లుతాయి: ఐసీసీ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top