'సన్‌'చలనం: అశ్విన్‌ మండిపాటు | Ravichandran Ashwin Bemoans Kings XI Punjab Batting Collapse | Sakshi
Sakshi News home page

అశ్విన్‌ మండిపాటు

Apr 27 2018 12:16 PM | Updated on Apr 27 2018 12:50 PM

Ravichandran Ashwin Bemoans Kings XI Punjab Batting Collapse - Sakshi

రవిచంద్రన్‌ అశ్విన్‌

సాక్షి, హైదరాబాద్‌: చెత్త ఫీల్డింగ్‌ కొంపముంచిందని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వాపోయాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మాట్లాడుతూ... తమ బ్యాట్స్‌మన్లు అనవసర రిస్క్‌ షాట్లకు ప్రయత్నించి ఓటమిని కొనితెచ్చుకున్నారని మండిపడ్డాడు. బౌలర్ల కారణంగానే సన్‌రైజర్స్‌ గెలిచిందన్నాడు.

‘చెత్త బ్యాటింగ్‌, సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా మేము ఓడిపోయాం. మిడిల్‌ ఆర్డర్‌లో వరుసగా వికెట్లు కోల్పోయాం. అతీగా ఎదురుదాడికి పోయి కొన్ని వికెట్లు చేజార్చుకున్నాం. మా జట్టులో మంచి ఫినిషర్లు ఉన్నప్పటికీ ఈరోజు రాణించలేకపోయారు. అయితే సరైన సమయంలో రాణిస్తారన్న నమ్మకం మాకుంది. మా టీమ్‌లో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదు. ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్‌ అస్సలు బాలేదు 20 ఓవర్లలో మ్యాచ్‌లో ఎక్కువ క్యాచ్‌లు వదలేయడంతో చివరికి మూల్యం చెల్లించుకున్నాం. ఈ క్యాచ్‌లు పట్టివుంటే 20 నుంచి 30 పరుగులు తక్కువగా ఇచ్చేవాళ్లం. తర్వాత మ్యాచ్‌లో ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడతామ’ని అశ్విన్‌ చెప్పాడు.

తమ బౌలర్‌ అంకిత్‌ రాజ్‌పుత్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని ప్రశంసించాడు. అంకిత్‌ రాజ్‌పుత్‌ 14 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ఈ సీజన్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అయితే తమ జట్టు ఓడిపోయినప్పటికీ అతడికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement