
న్యూఢిల్లీ: అంచనాలకు తగ్గట్లుగానే పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. వన్డే, టి20 ప్రదర్శనల నేపథ్యంలో 23 ఏళ్ల బుమ్రాకు దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్కు పిలుపొచ్చింది. జనవరి 5 నుంచి మొదలయ్యే సఫారీ పర్యటనతో పాటు లంకతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్కు సోమవారం ఢిల్లీలో సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. కెప్టెన్ కోహ్లితోపాటు ధావన్, భువనేశ్వర్లకు విశ్రాంతినిచ్చారు.
ఊహించినట్లే...
పరిమిత ఓవర్ల క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న బుమ్రాను టెస్టు జట్టుకు ఎంపిక చేయాలన్న వ్యాఖ్యలు ఇటీవల బాగా వినిపించాయి. దీనికితగ్గట్లే అయిదుగురు పేసర్ల బృందంలో అతడికి చోటు లభించింది. బుమ్రా 28 వన్డేల్లో 52 వికెట్లు, 30 టి20ల్లో 40 వికెట్లు తీశాడు. అదనపు కీపర్గా పార్థివ్ పటేల్కు స్థానం దక్కగా... ఏకైక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రస్తుత లంక సిరీస్కు జట్టులో ఉన్న చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయలేదు. కోహ్లి నేతృత్వంలోని 17 మంది సభ్యుల టెస్టు జట్టులో ఏడుగురు బ్యాట్స్మెన్, ఏడుగురు బౌలర్లు, ఇద్దరు వికెట్ కీపర్లు, ఒక ఆల్రౌండర్ ఉన్నారు. అజింక్య రహానే వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్కు జట్టు: కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), ధావన్, మురళీ విజయ్, రాహుల్, పుజారా, రోహిత్ శర్మ, సాహా, పార్థివ్ పటేల్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, భువ నేశ్వర్, షమీ, ఇషాంత్, ఉమేశ్, జస్ప్రీత్ బుమ్రా.