చక్ దే ఇండియా..! | Sakshi
Sakshi News home page

చక్ దే ఇండియా..!

Published Sat, Aug 29 2015 1:56 PM

చక్ దే ఇండియా..!

ధ్యాన్చంద్ జయంతి రోజునే భారత మహిళల జట్టు ఘనత
35 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్కు అర్హత



జాతీయ క్రీడాదినం (మేజర్ ధ్యాన్చంద్ జయంతి) ఆగస్టు 29న జాతీయ క్రీడ హాకీ అభిమానులకు శుభవార్త. మూడున్నర దశాబ్దాల తర్వాత భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్కు అర్హత సాధించింది. తద్వారా హాకీ దిగ్గజం ధ్యాన్చంద్కు ఘననివాళి అర్పించింది. భారత మహిళల హాకీ జట్టు చివరి సారిగా 1980లో ఒలింపిక్స్లో పాల్గొంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2016 రియో ఒలింపిక్స్లో భారత్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఘనమైన చరిత్ర ఉన్న హాకీకి మళ్లీ మహర్దశ రావాలని ఆశిద్దాం. గత జూలైలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్లో భారత్ ఐదో స్థానంలో నిలిచి ఒలింపిక్ బెర్తుకు మార్గం సుగమం చేసుకుంది. తాజాగా యూరో హాకీ చాంపియన్షిప్ సెమీఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడంతో భారత్కు లైన్ క్లియరైంది.

భారత పురుషుల జట్టు ఒకప్పుడు ప్రపంచ హాకీ రంగాన్ని శాసించిన సంగతి తెలిసిందే. ఇందులో హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ది కీలక పాత్ర.  మూడు దశాబ్దాల పాటు భారత్ ప్రపంచ హాకీని మకుటంలేని మహారాజులా ఏలింది. భారత్ పురుషుల హాకీ జట్టు మొత్తం 8 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించింది. 1928 నుంచి 1956 వరకు వరసగా ప్రపంచ విజేతగా నిలిచింది. ఆ తర్వాత క్రమేణా ప్రాభవం కోల్పోయింది. 2008 ఒలింపిక్స్కు అర్హత సాధించకపోవడం భారత హాకీ చరిత్రలో చీకటి అధ్యాయం కాగా.. గత ఒలింపిక్స్లో చిట్టచివరన 12వ స్థానంలో నిలిచింది.

పురుషుల జట్టుతో పోలిస్తే మహిళల జట్టుకు అంతటి చరిత్ర లేదు. ఒలింపిక్ పతకం అటుంచి.. ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్కు అర్హత సాధించడమిది రెండోసారి మాత్రమే. 1980 ఒలింపిక్ గేమ్స్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 35 ఏళ్ల తర్వాత మరోసారి ఒలింపిక్స్లో ఆడబోతోంది. మునుపటితో పోలిస్తే హాకీకి ఆదరణ తగ్గడం (ప్రస్తుతం క్రికెట్కు ఉన్నంత క్రేజ్ గతంలో హాకీకి  ఉండేది).. హాకీ సంఘాల్లో గొడవలు.. పురుషుల జట్టుతో పోలిస్తే అభిమానుల నుంచి తగ్గిన ప్రోత్సాహం లేకపోయినా.. భారత అమ్మాయిలు అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటుతున్నారు. వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్లో పతకం కోసం బరిలో నిలిచారు. మహిళల హాకీ జట్టు విజయం దేశానికి గర్వకారణమని హాకీ ఇండియా ప్రశంసించింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement