శ్రీధర్ లేఖపైనే చర్చ | discussion on sridhar letter | Sakshi
Sakshi News home page

శ్రీధర్ లేఖపైనే చర్చ

Dec 16 2013 12:04 AM | Updated on Sep 2 2017 1:39 AM

చాలా రోజుల తర్వాత జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశం ఆదివారం అర్ధాంతరంగా ముగిసింది.

సాక్షి, హైదరాబాద్: చాలా రోజుల తర్వాత జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశం ఆదివారం అర్ధాంతరంగా ముగిసింది. దీనిని ఈ నెల 21కి వాయిదా వేశారు. హెచ్‌సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. బీసీసీఐ పదవిలో ఉన్న తాను ఇక్కడి బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నానంటూ శ్రీధర్ పంపిన లేఖపైనే సమావేశంలో వాదోపవాదాలు జరిగినట్లు సమాచారం. ముగ్గురు ఉపాధ్యక్షులు శివలాల్ యాదవ్, వెంకటపతి రాజు, ఇ. వెంకట్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదు.
 
 రాజీనామాపై చర్చ...
 గత ఆరు నెలల కాలంలో ఒక్క సారి కూడా సమావేశం కాని హెచ్‌సీఏ ఈసీ ఆదివారం రోజు సమావేశమైంది. అధ్యక్షుడు జి. వినోద్ దీనిని నిర్వహించారు. బీసీసీఐ వ్యవహారాల్లో బిజీగా ఉన్నందున తాను సమావేశానికి రాలేకపోతున్నానని, సంయుక్త కార్యదర్శి ద్వారా అన్ని కార్యకలాపాలు నిర్వహించాలని కోరుతూ శ్రీధర్ తనకు లేఖ రాశారని చెబుతూ ఈ సందర్భంగా వినోద్ దానిని చదివి వినిపించారు. అయితే ఈసీ సభ్యులు దీనిపైనే తమ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. శ్రీధర్ రాసిన లేఖ తమకు చూపించాలని, అప్పుడే ఇతర అంశాలపై చర్చిస్తామని వారు కోరినట్లు తెలిసింది. అయితే దీనికి వినోద్ అంగీకరించలేదు.
 
  దాంతో సమావేశంలో వాదోపవాదాలు జరిగాయి. శ్రీధర్ అసలు సెలవు కోరుతున్నారా...లేక పూర్తిగా రాజీనామా చేస్తారా తమకు స్పష్టం కావాలని ఈసీ సభ్యులు అడిగారు. అందుకే ఆయన స్వయంగా పంపిన లేఖను చూపించాలని ఒక ఈసీ సభ్యుడు కోరారు. శ్రీధర్ రాజీనామా చేస్తే మరో కార్యదర్శిని ఎంపిక చేసుకుంటామని, అప్పుడే హెచ్‌సీఏ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిర్వహించగమని మరో ఈసీ సభ్యుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరి వరకు వినోద్ దానిని చూపించలేదు. దాంతో ఈ నెల 21 వరకు గడువిస్తున్నామని, శ్రీధర్ అంశంపై స్పష్టత వచ్చాకే మళ్లీ సమావేశమంటూ ఈసీ సభ్యులు నిష్ర్కమించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement