
ఢాకా : వచ్చే నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్ వేదికగా జరగనున్న క్రికెట్ మెగా ఈవెంట్ ప్రపంచకప్-2019కు బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బంగ్లాదేశ్ సెలక్టర్లు మంగళవారం వెల్లడించారు. ఇంతవరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని పేసర్ అబు జాయేద్కు చోటు కల్పించడం విశేషం. ఇప్పటివరకు ఐదు టెస్టు మ్యాచులాడిన ఇతడికి ఏకంగా మెగా టోర్ని ద్వారా అరంగేట్రం చేసే అవకాశాన్ని కల్పించారు. అదే విధంగా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ మొసాడిక్ హుస్సేన్ ఆసియా కప్ తర్వాత.. తొలిసారిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక మొర్తజా కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ జట్టుకు ఆల్రౌండర్ షకీబల్ హసన్ వైస్ కెప్టెన్గా కొనసాగుతాడని సెలక్టర్లు పేర్కొన్నారు.
కాగా జూన్ 2న కెన్నింగ్టన్ ఓవల్లో దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచ్తో బంగ్లాదేశ్ వరల్డ్ కప్ జర్నీ ఆరంభం కానుంది. అంతకంటే ముందు మే 26, 28 తేదీల్లో వరుసగా పాకిస్తాన్, టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనుంది. ఇక టీమిండియాతో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు ఇప్పటికే ప్రపంచకప్ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్ తుదిజట్టు :
మష్రఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీం, షకీబల్ హసన్(వైస్ కెప్టెన్), సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, సబ్బీర్ రెహ్మాన్, మెహిది హసన్, మహ్మద్ మిథున్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, మహ్మద్ సైఫుద్దీన్, మొసాడిక్ హుస్సేన్, అబు జాయేద్
Bangladesh Squad for the ICC Cricket World Cup 2019!#CWC19 #RiseOfTheTigers #Tigers pic.twitter.com/pik24tNFGj
— Bangladesh Cricket (@BCBtigers) April 16, 2019