కశ్యప్ శుభారంభం | Asian C’ship: Sindhu, Kashyap, Gurusaidutt win opening matches | Sakshi
Sakshi News home page

కశ్యప్ శుభారంభం

Apr 24 2014 1:38 AM | Updated on Sep 2 2017 6:25 AM

కశ్యప్ శుభారంభం

కశ్యప్ శుభారంభం

అనుకూలమైన ‘డ్రా’ను సద్వినియోగం చేసుకొని... కనీసం కాంస్యం సాధించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత స్టార్ పారుపల్లి కశ్యప్ తొలి అడ్డంకిని అధిగమించాడు.

శ్రమించి నెగ్గిన సింధు, గురుసాయిదత్
 శ్రీకాంత్ పరాజయం    
 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
 
 గిమ్‌చియోన్ (కొరియా): అనుకూలమైన ‘డ్రా’ను సద్వినియోగం చేసుకొని... కనీసం కాంస్యం సాధించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత స్టార్ పారుపల్లి కశ్యప్ తొలి అడ్డంకిని అధిగమించాడు. బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో కశ్యప్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 21-14, 21-17తో గో సూన్ హువాట్ (మలేసియా)పై గెలిచాడు. 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ రెండు గేముల్లోనూ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సూ జెన్ హావో (చైనీస్ తైపీ)తో కశ్యప్ ఆడతాడు. గతేడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో సూ జెన్ హావోతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వరుస గేముల్లో నెగ్గాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ బరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల్లో గురుసాయిదత్ ముందంజ వేయగా... కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. తొలి రౌండ్‌లో గురుసాయిదత్ 22-20, 23-21తో ఫెట్‌ప్రదాబ్ ఖోసిట్ (థాయ్‌లాండ్)పై కష్టపడి గెలుపొందాడు. ప్రపంచ చాంపియన్ లిన్ డాన్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 7-21, 14-21తో ఓడిపోయాడు.
 
 మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధు శ్రమించి గెలిచింది. ప్రపంచ 147వ ర్యాంకర్ చుయెంగ్ ఎన్‌గాన్ యి (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 21-15, 15-21, 21-18తో విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ హిరోస్ (జపాన్)తో సింధు తలపడుతుంది. హిరోస్‌తో గతంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సింధు ఓడిపోవడం గమనార్హం.
 
 మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప (భారత్) జోడి 21-18, 21-15తో ఫూ మింగ్తియాన్-నియో వానెస్సా (సింగపూర్) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) 21-16, 13-21, 20-22తో లో జువాన్ షెన్-హెగ్ నెల్సన్ (మలేసియా) చేతిలో; అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా (భారత్) 18-21, 19-21తో జాంగ్ వెన్-వాంగ్ యిల్వ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement