
శ్రీకాంత్కు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.
విజయవాడ: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. వరుసగా రెండు టైటిల్స్ సాధించిన శ్రీకాంత్కు వెయ్యి గజాల స్థలం, రూ. 50 లక్షల నగదు ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కోచ్ పుల్లెల గోపీచంద్కు రూ. 15 లక్షల బహుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు.
తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శ్రీకాంత్ను ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా షటిల్ బ్యాట్ను సీఎంకు శ్రీకాంత్ అందజేశారు. అతడితో చంద్రబాబు సరదాగా షటిల్ ఆడారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన క్రీడాకారుడు శ్రీకాంత్ అని ప్రశంసించారు. శ్రీకాంత్ ఇక ఏపీ తరపున ఆడతారని తెలిపారు. విదేశీ కోచ్ను పెట్టుకునేందుకు అతడికి సహాయం అందిస్తామన్నారు. అమరావతిలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.