పాండ్యా సూపర్‌ ఫీల్డింగ్‌.. టర్నింగ్‌ పాయింట్‌ ఇదే! | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 14 2018 9:27 AM

Amla run out with Pandya direct hit - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టులో బ్యాట్‌తో మెరిసిన టీమిండియా ఆల్‌రౌండర్‌ పాండ్యా ఆ తరువాత చెప్పుకోదగిన ఇన్నింగ్స్‌ ఆడలేదు. గత నాలుగు వన్డేల్లో అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. అయితే మంగళవారం జరిగిన ఐదో వన్డేలో బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన పాండ్యా.. తన మార్క్‌ ఫీల్డింగ్‌తో మెరిసాడు. బౌలింగ్‌లోను రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో  కీలక పాత్ర పోషించాడు. ఇక దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లాను పాండ్యా చేసిన రనౌట్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

హాఫ్‌ సెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయిన ఆమ్లా(71)ను పాండ్యా అద్భుత ఫీల్డింగ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. దీంతో భారత్‌ విజయం సులువైంది. భువనేశ్వర్‌ వేసిన 35 ఓవర్‌ రెండో బంతికి ఆమ్లా మిడాఫ్‌ దిశగా ఆడి సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు. ఆ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పాండ్యా రెప్పపాటులో బంతిని అందుకొని నాన్‌స్ట్రైకింగ్‌ వికెట్ల వైపు విసరడంతో బంతి నేరుగా వికెట్లను తాకింది. ఫీల్డ్‌ అంపైర్‌ ధర్డ్‌ అంపైర్‌కు నివేదించాడు. అందరూ ఆమ్లా క్రీజులో బ్యాట్‌ పెట్టారని భావించారు. థర్డ్‌ అంపైర్‌కు సైతం నిర్ణయం ప్రకటించడం సవాలుగా మారింది. అన్ని కోణాల్లో పరిశీలించిన అంపైర్‌ ఆమ్లా బ్యాట్‌ క్రీజుకు మిల్లీమీటర్‌ దూరంలో ఉండటాన్ని గుర్తించి అవుట్‌గా ప్రకటించాడు. 

దీంతో ఆమ్లా పెవిలియన్‌ చేరాడు. భారత ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. అప్పటికి ఆతిథ్య జట్టు 166 పరుగుల చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఆమ్లా అవుట్‌ కాకుంటే భారత్‌ విజయానికి చాలా కష్టమయ్యేదని, పాండ్యా సూపర్‌ ఫీల్డింగే మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement