రైతుల ఆందోళన.. స్పందించిన మంత్రి

Minister mahender reddy responded to farmers protest - Sakshi

చేవెళ్ల : తాము పండించిన కూరగాయలు, పూలను ఆర్టీసీ బస్సులలో తీసుకెళ్లేందుకు డ్రైవర్లు నిరాకరించటంతో రైతులు  చేవెళ్ల బస్‌స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉదయం  మార్కెట్‌కు కూరగాయలు, పూలను తీసుకెళ్లేందుకు చేవెళ్ల బస్‌స్టేషన్‌కు వచ్చారు. అయితే కూరగాయలు, పూల మూటలను బస్సులలో ఎక్కించేందుకు బస్సు డ్రైవర్లు అడ్డు చెప్పటంతో రైతులు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. దీంతో  రైతులకు, డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రైతులు బస్సులను పోనివ్వకుండా ఆందోళనకు దిగారు. దాదాపు గంట పాటు బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి పంటలను బస్సులలో అనుమతించాలని ఆర్టీసీ ఆర్‌ఎంకు ఫోన్‌ ద్వారా ఆదేశించారు. అప్పటికే మండల కేంద్రంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులొచ్చి రైతులకు నచ్చజెప్పి పూలు, కూరగాయల మూటలను బస్సులలో ఎక్కించి   పంపించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.  

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top