‘గుండెపోటని చంద్రబాబు నాటకాలు ఆడే అవకాశం ఉంది’

YS Vijayamma Camping At Narpala In Anantapur - Sakshi

ఏపీలో నిజమైన రౌడీ చంద్రబాబు

గెలవడానికి అనేక కుట్రలు చేస్తున్నారు

నా పుట్టినిల్లు ఇదే జిల్లా.. వైఎస్‌ జగన్‌ను దీవించండి

అనంతపురం జిల్లా నార్పల సభలో వైఎస్‌ విజయమ్మ

సాక్షి, అనంతపురం: పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరోపించారు. గత ఐదేళ్ల కాలంలో రైతులను, నిరుద్యోగులను టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆమె మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను సీఎం చేస్తే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటారని విజయమ్మ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం భర్తీ చేయడంలేదని, జగన్‌ సీఎం అయిన వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా నార్పల సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. తన పుట్టినిల్లు ఆ జిల్లానే అని గుర్తుచేశారు. ఈ జిల్లా మనువడైన వైఎస్‌ జగన్‌ను ప్రజలంతా దీవించాలని ఆమె కోరారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలుచేయలేదని, బీసీ, మైనార్టీల ద్రోహి చంద్రబాబని ధ్వజమెత్తారు. మైనార్టీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, వైఎస్‌ జగన్‌ బీసీలకు పెద్దపీఠ వేశారని పేర్కొన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని ఆమె గుర్తుచేశారు. చివరి వరకూ ప్రజల సంక్షేమం కోసమే తపించి.. ప్రజలే ముఖ్యమని వెళ్తూ వైఎస్సార్‌ మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌పై అనేక అక్రమ కేసులను పెట్టి.. ఎన్నో హింసలకు గురిచేశారని విజయమ్మ అన్నారు.

ప్రజల కోసం, ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వడంని ప్రజలను కోరారు. ‘‘ఏపీలో నిజమైన రౌడీ చంద్రబాబు. ఎవరైనా ఎదురు తిరిగితే.. తాటతీస్తా.. ఫినిష్‌ చేస్తా అంటూ బెదిరిస్తున్నారు. అమరావతి పేరుతో టీడీపీ నేతలు భూ దోపిడీ చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఏపీ ప్రజల డాటా చోరీ చేసిన దొంగ చంద్రబాబు. భన్వర్‌లాల్‌కు.. రోజాకు సంబంధం ఉందని చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గుందా. ఆడవాళ్లను గౌరవించే విధానం ఇదేనా. మహిళల మాన ప్రాణాలతో చంద్రబాబు నీచ రాజకీయలు చేస్తున్నారు. మూడు రోజుల నుంచి చంద్రబాబు అనేక డ్రామాలు ఆడుతున్నారు. గుండెపోటు పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడే అవకాశం కూడా ఉంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. వైఎస్సార్‌సీపీకి ఓటు వేయండి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top