చరిత్రను మలుపు తిప్పే ఎన్నిక | Sakshi
Sakshi News home page

చరిత్రను మలుపు తిప్పే ఎన్నిక

Published Fri, Sep 27 2019 3:31 AM

Uttam Kumar Reddy Over Huzurnagar ByElection - Sakshi

చింతలపాలెం (హుజూర్‌నగర్‌):హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పే ఎన్నిక అని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఎవరు నిస్వార్థంగా పని చేశారో, ఎవరు పోలీసులను అడ్డం పెట్టుకుని గలీజు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. ఇది అవినీతి అధికారానికి – నీతి నిజాయితీకి జరుగుతున్న పొరాటం అని అభివర్ణించారు. కాంగ్రెస్‌ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, జైలుకు పంపడం, జైలునుంచి విడుదల కాగానే వారిని బెదిరించి, మంత్రి జగదీశ్‌రెడ్డితో మాట్లాడించి పార్టీలో చేర్చుకోవడం టీఆర్‌ఎస్‌ గలీజు రాజకీయాలకు పరాకాష్ట అని ఉత్తమ్‌ ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌పై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. ‘కేటీఆర్‌ ఓ రాజకీయ బచ్చ.. మీ అయ్య ఇచ్చిన పదవితో విర్ర వీగవద్దు’అని హితవు పలికారు. 

నామినేషన్‌ వేసిన పద్మావతి
చింతలపాలెం (హుజూర్‌నగర్‌): హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ఊపందుకుంది. గురువారం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పద్మావతిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. మొత్తం ముగ్గురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో కాంగ్రెస్‌ నుంచి పద్మావతి, హైదరాబాద్‌ హయత్‌నగర్‌కు చెందిన మేకల రఘుమారెడ్డి, సిద్ధిపేటకు చెందిన గజిబింకార్‌ బన్సీ లాల్‌ తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు.

నామినేషన్‌ వేస్తు్తన్న పద్మావతి

Advertisement
Advertisement