గులాబీ ప్రభంజనంలో కీలక మంత్రులకు షాక్‌! | Telangana Ministers Get Shocking Results | Sakshi
Sakshi News home page

Dec 11 2018 1:42 PM | Updated on Dec 11 2018 7:18 PM

Telangana Ministers Get Shocking Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ అంతటా గులాబీ ప్రభంజనం వీస్తున్నప్పటికీ.. పలువురు ఆపద్ధర్మ మంత్రులకు మాత్రం ఎదురుగాలి వీస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సీనియర్‌ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వర్‌రావు ఓటమిపాలయ్యారు. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌ రెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలవ్వడం గమనార్హం. కొల్లాపూర్‌లో మరో సీనియర్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. ములుగులో అజ్మీరా చందూలాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సీతక్క చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తాండూరులో పట్నం మహేందర్‌రెడ్డికి ఓటమి తప్పలేదు. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారికి కూడా చేదు అనుభవం ఎదురయ్యే అవకాశముంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం భుపాలపల్లిలో మధుసూదనాచారిపై కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డి హోరాహోరీ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రౌండ్‌.. రౌండ్‌కు ఆధిక్యం చేతులు మారుతోంది.

ఇక, ఇతర కీలక మంత్రులు భారీ విజయాల దిశగా సాగుతున్నారు. ఎప్పటిలాగే సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ఆయన మెజారిటీ లక్షదాటడం కొత్త రికార్డులు సృష్టించింది. మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లలో 70వేలకుపైగా మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఇద్దరు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావు మంచి ఊపుతో ఉన్నారు. సనత్‌నగర్‌లో తలసాని శ్రీనివాస్‌ 30వేలకుపైగా మెజారిటీతో గెలుపొందగా.. పద్మారావు మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement