అక్కచెల్లెమ్మల అభిమానం.. తడిసి ముద్దయిన జననేత

Raksha Bandhan Celebrations At Praja Sankalpa Yatra - Sakshi

పాదయాత్రలో ఆద్యంతం రాఖీ పౌర్ణమి సందడి 

అడుగడుగునా రాఖీలు కట్టి ఆత్మీయత చాటుకున్న వైనం 

చిరుజల్లుల్ని లెక్కచేయకుండా అడుగులో అడుగేసిన జనం 

ఊరూరా ఘన స్వాగతం.. వీధి వీధినా సందడే సందడి 

మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పలువురి ఆవేదన  

బాబు సర్కారు.. పొట్ట కొట్టిందని సాక్షర భారత్‌ కోఆర్డినేటర్ల ఫిర్యాదు 

ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోయిన సెజ్‌ నిర్వాసితులు 

బలవంతపు భూ సేకరణకు బాబు సిద్ధమయ్యారని ఆందోళన 

అందరి కష్టాలు విని ధైర్యం చెబుతూ ముందుకు సాగిన ప్రతిపక్ష నేత 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అక్కచెల్లెమ్మల అనురాగం.. చిరుజల్లుల్ని సైతం లెక్కచేయకుండా లెక్కకు మించిన జనం.. గ్రామగ్రామానా అంతులేని ఆత్మీయత, అభిమానం.. మరోపక్క సమస్యల తోరణాలు, వినతులు, విన్నపాల మధ్య ప్రజా సంకల్ప యాత్ర 246వ రోజు ఆదివారం విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అక్కచెల్లెమ్మలు దారిపొడవునా రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. రాంబిల్లి మండలం ధారభోగాపురం మొదలు.. వెంకటాపురం, గొర్లిధర్మవరం, వెదురవాడ, అచ్యుతాపురం, రామన్నపాలెం వరకు సాగిన యాత్రలో ప్రజా సమస్యలు వింటూ, జనం నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తూ, పరిష్కరించదగినవి అక్కడికక్కడ పరిష్కరిస్తూ, మిగతా వాటిని పరిశీలించండని తన సిబ్బందిని ఆదేశిస్తూ జననేత ముందుకు సాగారు. అంతకు ముందు విశ్వమాత మదర్‌ థెరిసా జయంతి సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. 

సాక్షర భారత్‌ కోఆర్డినేటర్లను తొలగిస్తారా? 
‘సార్, చంద్రబాబు ప్రభుత్వం సాక్షర భారత్‌ కో ఆర్డినేటర్ల (ఎంసీఓలు)కు కడుపుకోత మిగిల్చింది. జిల్లా, మండల, గ్రామ స్థాయి సమన్వయ కర్తలు దాదాపు 21 వేల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించి బజారు పాల్జేసింది. వంద శాతం అక్షరాస్యత సాధించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేట్టిన సాక్షర భారత్‌ను రాష్ట్రంలో ఎందుకూ కొరగాకుండా చేశారు. సార్‌.. మీరు అధికారంలోకి రాగానే మాకు న్యాయం చేయాలి సార్‌..’ అంటూ పలువురు మండల కోఆర్డినేటర్లు జగన్‌ను కలిసి వాపోయారు. నాలుగున్నరేళ్లుగా గొడ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2010 ఆగస్టు ఒకటి నుంచి తాము పని చేస్తున్నామని, తమకు ఇచ్చే నామమాత్రపు వేతనాలలో 60 శాతాన్ని కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తాయని వివరించారు. గోదావరి పుష్కరాలు మొదలు.. గ్రామ స్థాయి సర్వేల వరకు తమ సేవల్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఇంత కాలం పని చేసిన తమను ఈ ఏడాది మార్చి 31 నుంచి తొలగిస్తున్నట్టు జూన్‌ 14న వయోజన విద్యా శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని సాక్షర భారత్‌ కోఆర్డినేటర్ల సంఘం నాయకులు సీహెచ్‌ శ్రీను, శివ, గడ్డం ఉమా తదితరులు జగన్‌కు విన్నవించారు. కేరళ రాష్ట్రంలో మాదిరి తమకూ వేతనాలు ఇవ్వడమే కాకుండా తమ సేవలను క్రమబద్ధీకరించేలా చూడాలని కోరారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ.. ఈ సమస్యను తేలిగ్గా వదిలిపెట్టబోనని, క్షుణ్ణంగా పరిశీలించి తగు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. 

అడుగడుగునా అనురాగం.. ఆత్మీయత.. 
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌. చేతుల్లో రాఖీలు, పూలు, పండ్లు, హారతులతో పెద్దఎత్తున మహిళలు జగన్‌కు స్వాగతం పలుకుతూ తమ ఆత్మీయతను, అనురాగాన్ని పంచిపెట్టారు. నేటి పాలకుల దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ పలువురు తమ ప్రియతమ నేత జగన్‌కు రాఖీలు కట్టి నోరు తీపి చేశారు. పాదయాత్ర శిబిరం వద్ద నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు పార్టీ మహిళా నేతలు వరుదు కళ్యాణి, పసుపులేటి ఉషాకిరణ్, గౌరీ, పిల్లంగొయి శ్రీలక్ష్మి తదితరులు జగన్‌కు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. అక్కడి నుంచి యాత్ర ముగిసే వరకు అసంఖ్యాక మహిళలు జగన్‌కు రాఖీలు కట్టి, ఆయనతో పాటు అడుగులో అడుగు వేశారు. పాదయాత్రలో ఆద్యంతం రాఖీ పౌర్ణమి సందడి చోటుచేసుకుంది.

యలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురం మండలం జగన్‌కు నీరాజనాలు పలికింది. చిరు జల్లులు పడుతున్నా, రోడ్లన్నీ చిత్తడిగా ఉన్నా భారీగా జనం బారులు తీరి జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకించి మహిళా లోకం నీరాజనాలు పలికింది. అచ్యుతాపురం సెంటర్‌లో వందలాది మహిళలు గొడుగులు పట్టుకుని రాఖీలు కట్టేందుకు పోటీ పడ్డారు. పలువురు చిన్నారులు జగన్‌ను కలిసి రాఖీలు కట్టారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ప్రభుత్వ హయాంలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని విన్నవించారు. స్కూళ్లు, హాస్టళ్లతో పాటు వీధివీధినా ఆకతాయిలు అల్లరి చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు పాలనలో పూటకో అత్యాచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కచెల్లెమ్మల భద్రత, రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని వారికి జగన్‌ భరోసా ఇచ్చారు. 

సెజ్‌ కాలనీలో అన్నీ సమస్యలే 
అచ్యుతాపురం సెజ్‌ పునరావాస కాలనీవాసులు వారి కష్టాలను జననేత ఎదుట ఏకరువుపెట్టారు. ‘ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన రూ.1.75 లక్షలు ఎందుకూ సరిపోవడం లేదు. ఆ మొత్తాన్ని కనీసం రూ.2 లక్షలకైనా పెంచాలి. కుటుంబ పెద్దకే ప్యాకేజీ మొత్తాన్ని ఇవ్వాలి. మేజర్లు అయిన పిల్లలకు, వితంతువులకు కూడా ప్యాకేజీని వర్తింపజేయాలి. కాలనీలో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేయాలి.  సహాయ పునరావాస చట్టం ప్రకారం సౌకర్యాలు కల్పించాలి. నిర్వాసితులలో వృద్ధులకు నెలకు రూ.5 వేల పింఛన్‌ ఇవ్వాలి’ అని కోరారు. ఇవన్నీ వచ్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సెజ్‌కు రెండో విడత భూ సేకరణ చేయకుండా చూడాలని రాంబిల్లి మండలం గొరపూడి, విజయరాంపురం, అగ్రహారం గ్రామాల ప్రజలు జగన్‌కు విన్నవించారు. విలువైన తమ భూముల్ని బలవంతంగా తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కోటి రూపాయల విలువైన భూములకు రూ.20 లక్షలకు మించి ఇవ్వబోమంటున్నారని, అందుకు అంగీకరించకపోతే బలవంతంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. భూముల రిజిస్ట్రేషన్లు కూడా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.   

వెల్లువెత్తిన వినతులు.. 
గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల పరిహారం ఇప్పించాలని యాదవ కార్మిక సంఘం జననేతను కోరింది. తమకు కూడా 45 ఏళ్లకే పింఛన్‌ ఇప్పించాలని కోరారు. రాష్ట్రంలో 55 లక్షల మంది యాదవులు ఉంటే ఒక్క విశాఖ జిల్లాలో 8 లక్షల మందికి పైగా ఉన్నామని వివరించారు. గొర్రెల మేపు కోసం స్థలాలు కేటాయించాలన్నారు. ఆరోగ్య శ్రీ అందడం లేదని, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని, నిరుద్యోగులకు ఉపాధి కరువైందని, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని, నేవల్‌ బేస్‌ ప్రాజెక్టు కింద నష్టపోయిన వారిని ఆదుకోవాలని దారిపొడవునా పలువురు జగన్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. చెట్టుపన్ను లేకుండా చేయాలని శెట్టిబలిజలు, తైక్వాండో అకాడమి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జి.జ్యోతి అనే క్రీడాకారిణి కోరారు. కేరళ వరద బాధితుల కోసం విజయ అనే మహిళ ఇచ్చిన రూ.40 వేల విరాళం చెక్కును మీ ద్వారా పంపాలని ఎం.సత్యనారాయణ అనే వ్యక్తి జగన్‌కు అందజేశారు. ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన తప్పెటగుళ్లను కళాకారుల కోరిక మేరకు జగన్‌ కాసేపు మోగించి ఆకట్టుకున్నారు.   

ఆందోళన విరమించాలట.. 
అన్నా.. ప్రత్యామ్నాయ నావికా స్థావరం (ఎన్‌ఏవోబి– నేవల్‌ ఆల్టర్‌నేటివ్‌ ఆపరేషనల్‌ బేస్‌) ఏర్పాటు వల్ల ఉపాధి కోల్పోయాము. భూములు, పశువుల పాకలు కోల్పోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. 1400 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. మా గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించి ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం చేయాలని 22 రోజులుగా ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. అండగా నిలవాల్సిన స్థానిక ఎమ్మెల్యే పంచకకర్ల రమేష్‌ బాబు ధర్నా శిబిరం వద్దకు వచ్చి ఆందోళన విరమించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆందోళనకారులకు మంచి నీళ్లు కూడా దొరకకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మీరు మాకు న్యాయం జరిగేలా చూడాలన్నా.. 
–  హరిపురం క్రాస్‌ వద్ద వైఎస్‌ జగన్‌తో దొడ్డి సుభద్ర, చినకలవలాపల్లి ప్రజలు 

ఈ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమా రాలేదు
అన్నా.. దివంత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మా అచ్యుతాపురం మండలంలో సెజ్‌ ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించారు. ఇక్కడ బ్రాండిక్స్‌ కంపెనీతోపాటు పలు కంపెనీలు ప్రారంభించడం వల్ల 18 వేల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఈ ప్రభుత్వం కొత్తగా ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదు.. ఉద్యోగాలు ఇచ్చిందీ లేదు. ఎన్‌ఏవోబీ కోసం మా ఊరి చుట్టూ ఉన్న పొలాలు సేకరించారు గానీ మమ్మల్ని నిర్వాసితులుగా చేర్చలేదు. వందలాది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  
– వైఎస్‌ జగన్‌తో ఎం వెంకటలక్ష్మి, కొత్తపేట 

జగనొత్తే మా కట్టాలన్నీ తీరతాయి 
మహానుభావుడు రాజశేఖరరెడ్డి నాకు రెండొందల రూపాయల పింఛన్‌ మంజూరు చేశాడు. జగన్‌ బాబు వత్తే పింఛనీ రెండు వేలు చేత్తాడంట.. అందుకే ఆ బాబును చూడటం కోసం నర్సాపురం నుంచి వచ్చాను. వాళ్ల నాయనలాగే జగన్‌ బాబు మాటిచ్చారంటే చేస్తారు. ఈ సారి మా ఓట్లన్నీ ఆయనకే. ఆయన పెడతానంటున్న పథకాలు చానా బాగున్నాయి. పిల్లల్ని బడికి పంపితే డబ్బులిత్తామనడం పేదోళ్లందరికీ ఊరటే. ఆలాంటి బాబు సీఎం అయితే మా కట్టాలన్నీ తీరిపోతాయి. జగన్‌బాబును కలిసి ఇదే ఇషయం సెప్పాను.       
 – కోడ మంగ, వాడ నర్సాపురం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top