‘తూత్తుకుడి బాధ్యులు డీఎంకే-కాంగ్రెస్’
డీఎంకే పాలనలోనే స్టెరిలైట్కు అనుమతులు: సీఎం పళనిస్వామి
సాక్షి, చెన్నై: తూత్తుకుడి ఘటనకు డీఎంకే-కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాలని తమిళనాడు ముఖ్యముంత్రి కె. పళనిస్వామి ఆరోపించారు. తూత్తుకుడి ఘటనపై ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ పళని ప్రభుత్వంపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. స్టెరిలైట్కు డీఎంకే, కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే అనుమతులన్ని వచ్చాయని, ఈ ఘటనకు డీఎంకే- కాంగ్రెస్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
డీఎంకే భాగస్వామిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీకి కావాల్సిన భూములకు అనుమతినిచ్చిందన్నారు. 2009లో స్టాలిన్ పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న సమయంలో స్టెరిలైట్ రెండో దశ విస్తరణకు 230 ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. ఘటనలో 13మంది మరణించగా, 58 మంది ఆందోళనకారులు, 72 మంది పోలీసు సిబ్బందికి తీవ్ర గాయలైనట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. ఘటనపై ముఖ్యమంత్రి శ్వేత పత్రం విడుదల చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. స్టెరిలైట్కు నిరసనగా తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు.