న్యాయ్‌తో ఆర్థిక వ్యవస్థ పరుగులు

NYAY Scheme Will Be Petrol For India Economy - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌

బిలాస్‌పూర్‌/భిలాయ్‌: తాము అధికారంలోకి వస్తే అమలు చేసే ‘న్యాయ్‌’ పథకం ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుందని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చెప్పారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్, ఉక్కునగరం భిలాయ్‌ల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ పాల్గొన్నారు. ‘ఇంజిన్‌ను స్టార్ట్‌ చేయడంలో పెట్రోల్‌ ఉపయోగపడినట్లే ‘న్యాయ్‌’ అమలుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. ఉత్పత్తి యూనిట్లను పునరుద్ధరిస్తాం. దాంతోపాటే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి’ అని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద మహిళ బ్యాంకు అకౌంట్‌లో ఏడాదికి రూ.72 వేలు జమ చేస్తామన్నారు. రైతులకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడంతోపాటు రైతులు డిమాండ్‌ చేసిన ప్రతిసారీ పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. గత ఎన్నికల్లో అచ్చేదిన్‌ నినాదం వినిపించగా ఈసారి కాపలాదారే దొంగ(చౌకీదార్‌ చోర్‌ హై)అని ప్రజలు అంటున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. ‘అమలు చేసేవైతేనే వాగ్దానం చేస్తా, మీరు ఎంతగా ఒత్తిడి తెచ్చినా రూ.15 లక్షలను మాత్రం మీ అకౌంట్లలో జమ చేయలేను’ అని బీజేపీ 2014 ఎన్నికల హామీని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top