నిజాయితీకి నిదర్శనం నీలం.. | Neelam Sanjiva Reddy Special Story on Lok Sabha Election | Sakshi
Sakshi News home page

నిజాయితీకి నిదర్శనం నీలం..

Mar 28 2019 8:54 AM | Updated on Mar 28 2019 8:54 AM

Neelam Sanjiva Reddy Special Story on Lok Sabha Election - Sakshi

శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యులుగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా, లోక్‌సభ స్పీకర్‌గా అన్నిటికీ మించి దేశ ప్రథమ పౌరునిగా అనితరసాధ్యమైన రాజకీయ పయనం, మహోన్నత వ్యక్తి ఓ సామాన్య కుటుంబం నుండి వచ్చారంటే ఆశ్చర్యమ నిపిస్తుంది. రాజకీయాల్లో మేరునగ ధీరుడిగా పేరొందిన నీలం సంజీవరెడ్డి జీవితం ‘అనంత’ చరిత్రతో కలగలసిపోయింది. నిశితంగా పరిశీలిస్తే ఆయన వల్లే ‘అనంత’ కీర్తి దేశవ్యా ప్తమైంది. ఆ తరానికి చెందిన రాజకీయ నాయకులు కావడంతో విలువలకు ప్రాధాన్యతనిచ్చి పదవులను తృణప్రాయంగా వదిలేసి, ఆదర్శప్రాయుడు, నిజాయితీకి నిదర్శనంగా నిలిచారు. స్వాతంత్రోద్యమం నుంచి తనువు చాలించేదాకా భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుదన్నుగా నిల్చిన నీలం సంజీవరెడ్డి జీవిత విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి. – గుంటి మురళీకృష్ణ 

సాక్షి  అనంతపురం కల్చరల్‌ :కరువుకు పర్యాయపదంగా మారిన అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామం ఇల్లూరులో నీలం సంజీవరెడ్డి 1913 మే 19న జన్మించారు. 1931లో జాతీయోద్యమంలోకి ప్రవేశించారు. 1946లో మద్రాసు అసెంబ్లీ సభ్యుడుయ్యారు. 1947లోభారత రాజ్యాంగ సభ్యులుగా ఎన్నికయ్యారు. చాలామంది రాజ్యాంగ రచన అంటే అంబేడ్కర్‌ ఒకరే అనుకుంటారు. రాజ్యాంగ నిర్మాణంలో నీలం సంజీవరెడ్డి కూడా కీలక పాత్ర వహించారు. మద్రాసురాష్ట్ర ప్రభుత్వంలో 1949 నుండి 1952 వరకూ మద్యపాన నిషేధశాఖామంత్రిగా పనిచేశారు. 1952లో రాజ్యసభ సభ్యులయ్యారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకాశం మంత్రి వర్గంలో, 1955లో బెజవాడ గోపాలరెడ్డి మంత్రి వర్గంలోనూ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

1959లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులయ్యారు. 1962లో తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. అందుకే బస్సుల జాతీయికరణ అంశం న్యాయస్థానం పరిశీలనకు తలొగ్గి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. లాల్‌బహుదూర్‌ శాస్త్రి మంత్రివర్గంలో ఉక్కుగనుల శాఖామంత్రిగా, ఇందిరాగాంధి మంత్రి వర్గంలో రవాణా, విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. హిందూపురం నుండి లోక్‌సభ సభ్యుడై 1967–69 మధ్య స్పీకర్‌గా పనిచేశారు. 1977లో నంద్యాల నుండి లోకసభకు ఎన్నికై , మార్చి నుండి జూలై వరకు మరోసారి లోకసభ స్పీకర్‌గా ఉన్నారు. అదే ఏడాది జూలై 25 నుండి 1982 జూన్‌ 24వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. పదవీవిరమణ అనంతరం చాలా కాలం జిల్లా కేంద్రంలోని  నాగవిహార్‌లో ఉన్నారు. కొంతకాలం బెంగళూరులో నివశించారు. ఎటువంటి వివాదాంశాలకు తావివ్వని విధానాలతో జీవితాన్ని సాకారం చేసుకున్న ఆయన చివరకు 1996 జూన్‌ 1 న మరణించారు. ఆయన బ్రతికి ఉన్న రోజుల్లోనే శ్రీకంఠం సర్కిల్‌లో ఆయనకు శిలావిగ్రహం ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement