‘తొలి పోరు’కు సిద్ధం.. 

MPTC And ZPTC Elections All Arrangements Is Completed - Sakshi

చుంచుపల్లి: తొలి విడత జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న 71 ఎంపీటీసీలు, 7 జెడ్పీటీసీ స్థానాల నామినేషన్ల ప్రక్రియ 24వ తేదీన ముగుస్తుంది. నామినేషన్ల స్వీకరణకు జిల్లా అధికారులు ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ 
అభ్యర్థుల నుంచి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు  స్వీకరిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఆయా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న అభ్యంతరాల స్వీకరణ, 27న వాటి పరిష్కారం ఉంటాయి.

నామినేషన్ల ఉపసంహరణకు 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. నామినేషన్‌ దాఖలు సందర్భంగా జెడ్పీటీసీ స్థానం జనరల్‌ అయితే రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.2,500 డిపాజిట్‌ చెల్లించాలి. ఎంపీటీసీలకు జనరల్‌ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత ఎన్నికల కోసం 443 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,190 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. తొలి విడతలో అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి మండలాల్లోని 71 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ స్థానాలకు  మే 6న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. బూర్గంపాడు మండలానికి చెందిన 11 ఎంపీటీసీ స్థానాలకు పదవీ కాలం మరో ఏడాది పాటు ఉన్నందున వాటికి ఎన్నికలు నిర్వహించరు. ఇక్కడ జెడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక ఉంటుంది.

2,12,755 మంది ఓటర్లు...  
జిల్లాలోని అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి మండలాల్లో ఎన్నికల ప్రక్రియకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో 7 మండలాల పరిధిలో 2,12,755 మంది ఓట్లు వేయనున్నారు. అశ్వాపురం మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 31,022 మంది, చర్లలో 12 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 30,625 మంది, దుమ్ముగూడెంలో 13 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 32,707 మంది, బూర్గంపాడు జెడ్పీటీసీ పరిధిలో 28,632 మంది, టేకులపల్లిలోని 14 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 37,548 మంది, పాల్వంచలోని 10 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 26,323 మంది, ములకలపల్లిలోని 10 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 25,898 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
  
తొలి విడత 7 మండలాల్లో రిజర్వేషన్లు ఇలా.. 

జిల్లా పరిధిలో 220 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీ స్థానాలుండగా వాటిలో బూర్గంపాడులోని 11 ఎంపీటీసీలకు ప్రస్తుతం ఎన్నికలు జరగవు. తొలి విడత ఎన్నికలు జరిగే 7 మండలాల ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. అశ్వాపురం ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను జనరల్‌ మహిళలకు కేటాయించారు. చర్ల ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ మహిళకు రిజర్వ్‌ చేశారు. దుమ్ముగూడెం ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ మహిళకు, జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. బూర్గంపాడులో కేవలం జడ్పీటీసీ ఎన్నిక మాత్రమే జరగనుండగా జనరల్‌ మహిళకు కేటాయించారు. పాల్వంచలో ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌కు రిజర్వు చేశారు. ములకలపల్లిలో ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ మహిళకు, జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు ఖరారు చేశారు. టేకులపల్లిలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఇక బరిలో నిలబడే జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.50 లక్షలు ప్రచారం నిమిత్తం ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం పరిమితి విధించింది.

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు  
జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న 7 మండలాల్లోని 71 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ స్థానాలకు సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు ఆయా మండల కేంద్రాలలోనే స్వీకరిస్తారు. నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలలో పూర్తి విషయాలను పొందుపరచాలి.  – డి.పురుషోత్తం, డిప్యూటీ సీఈఓ, ఎన్నికల లైజన్‌ అధికారి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top