ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు

Minister Subhash Chandra Bose Speech In AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టం చేశారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రభుత్వ భూముల అక్రమాలపై సభా సంఘం ఏర్పాటు చేయాలని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండు చేశారు. పీలేరులో ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. టీడీపీ నేతలు, అధికారులు కలిసి రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. పీలేరులో భూములు ఎకరా రూ.3, 4 కోట్లు పలుకుతుందని, దీని వెనుక రెవెన్యూ అధికారుల హస్తం ఉందన్నారు. టీడీపీ నేతలు నకిలీ పట్టాలతో డబ్బులు వసూలు చేశారని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపించాలని కోరారు. ఎయిర్‌పోర్టుకు ప్రభుత్వ,ప్రైవేట్‌ భూములు తీసుకున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు.

సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా మంత్రి సభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. అసైన్డ్‌ భూములు వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అధికారుల హస్తం ఉంటే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలంలో క్రిమినల్‌కేసులు నమోదు చేసామన్నారు. ఈ వ్యవహారంలో సీరియస్‌గా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ సూచించారని తెలిపారు. కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఆరోపణలపై సమాచారం లేదని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. భూకబ్జాల వ్యవహారాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సభ్యులను మంత్రి కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top