
శివపురి: తన కుమారుడు కార్తికేయ్ సింగ్ చౌహాన్ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు. శివపురిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో తొలిసారిగా కార్తికేయ్ పాల్గొన్నారు. అంతేకాదు తన మొట్టమొదటి ప్రసంగంలోనే ఆకట్టుకున్నారు. తన తండ్రిని కౌరవుడిగా వర్ణించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
‘మా నాన్న రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని ఓ ఎంపీ అంటున్నారు. రాజకీయాల్లో ఇంతకన్నా దిగజారుడుతనం ఉండదు. రాష్ట్ర ప్రజలందరూ ఇదంతా గమనిస్తున్నారు. సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతారు. ఎవరితోనూ మా నాన్నకు శత్రుత్వం లేదు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవాలని ఆయన కోరుకోవడం లేదు. పేదరికంపైనే ఆయన పోరాడుతున్నార’ని కార్తికేయ్ అన్నారు.
కొలారస్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో శివరాజ్ తనయుడి రాజకీయ ప్రవేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్సింగ్ యాదవ్ గత అక్టోబర్లో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానం కీలకం కావడంతో ఇక్కడ గెలిచేందుకు రెండు పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ విడుదల చేయలేదు.