
సాక్షి, హైదరాబాద్ : ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకంపై మాట్లాడటానికి ఏమీ లేక విమర్శకులు పదాలు వెతుక్కుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. గొంతు చించుకుని ఇది అబద్దం అని అరవడం వల్ల నిజాలు అబద్ధాలు కావని వ్యాఖ్యానించారు.
‘నేను హైదరాబాద్లో ఉండి కొత్త రాష్ట్రంపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నానని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఇంకా హైదరాబాద్లోనే ఉంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్స్లోని నిబంధనలు ఇంకా పూర్తిగా అమలు కాలేదు. ప్రస్తుత మంత్రులు, అధికారులు కార్యనిర్వహణ దృష్ట్యా అమరావతిలో ఉంటున్నారు.
అధికారంలో లేకపోతే ఎంత మంది మంత్రులు రాజధాని అమరావతిలో ఉంటారు? రిటైర్మెంట్ తర్వాత ఎంత మంది అధికారులు అమరావతిలో సెటిలవుతారు? హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కు 50 ఏళ్ల అనుబంధం ఉంది. అమరావతికి అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. నాకు హైదరాబాద్తోనే ఎక్కువ అనుబంధం ఉందని అనేవారికి ఒకటే చెబుతున్నా.. నేను పుట్టింది ఏపీలో. చదివింది, పని చేసింది ఏపీలో. ఏపీతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది.
ఏపీ ప్రభుత్వంలో పని చేశాను కాబట్టి ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. ప్రభుత్వాన్ని ఎవరూ వెలెత్తి చూపకూడదని నాయకులు భావిస్తున్నారు. ఎవరి రాజధాని అమరావతి పుస్తకం చదివిన తర్వాత ఎవరికైనా అనుమానాలు ఉంటే నేను చర్చకు సిద్ధం.’