
సాక్షి, నల్లగొండ : హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కోట రామారావును బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక చేసింది. టికెట్ రేసులో శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బా భాగ్యారెడ్డి, ఎన్ఆర్ఐ కోటా అప్పిరెడ్డి ఉండగా చివరకు రామారావుకు టికెట్ దక్కింది. మొదట శ్రీకళా రెడ్డికి టికెట్ ఖరారు అవ్వగా కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోటీ నుండి తప్పుకున్నారు. కాగా, టీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. నామినేషన్లకు ఈనెల 30 వరకూ గడువు ఉంది. అక్టోబరు 21న పోలింగ్ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి.
కాగా, హుజుర్నగర్ ఉప ఎన్నిక విజయం ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలకు సవాల్గా మారింది. హుజూర్నగర్లో పాగా వేయాలని అధికార టీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గెలుపు బాధ్యతను సీనియర్ నేత పల్లారాజేశ్వర్ రెడ్డికి అప్పగించింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంలో గెలిచిన బీజేపీ హుజూర్నగర్ను కైవసం చేసుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. మాజీ ఎమ్మెల్యే కుమార్తె, కోదాడ వాసి శ్రీకళారెడ్డి పేరు ముందుగా తెరపైకి వచ్చినా చివరకు రామారావు పేరును ఖరారు చేసింది. శ్రీకళారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. (చదవండి: హుజుర్నగర్లో త్రిముఖ పోరు)