పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ

Former Deputy Chairman Satish Kumar Reddy Resigned To TDP In Pulivendula - Sakshi

సాక్షి, కడప (వైఎస్సార్‌ జిల్లా) : పులివెందులలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పదవిని కూడా ఆయన వదులుకున్నారు. తెలుగు దేశం పార్టీని వీడుతున్నట్లు తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా టీడీపీలోనే ఉంటున్నా సరైన ఆదరణ లభించలేదని తీవ్ర ఆవేదనన చెందారు. తన మనసును చంపుకొని పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. 20 ఏళ్లుగా కష్టపడి పనిచేసినా ఆదరణ లేకపోవడంతోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సతీష్‌రెడ్డి తెలిపారు. కార్యకర్తల అభీష్టానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. (చదవండి: వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి)
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top