రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి : జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బుధవారం గాంధీభవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల గురించి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతోన్న రుణమాఫీపై ఇంకా స్పష్టత రాలేదని మండి పడ్డారు. వడ్డీ చెల్లింపు అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో బ్యాంకులు రైతుల దగ్గర నుంచే ముక్కు పిండి వడ్డీ వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కేబినెట్లో రైతుల గురించి, ఉద్యోగస్తుల గురించి మాట్లాడకపోవడం దారుణమన్నారు.
టీఆర్టీకి ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్, పీఆర్సీ, ఐర్ 27 శాతం పెంచారన్నారు. కానీ మన దగ్గర ఆ ప్రస్తావనే రాలేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు చేస్తున్నారని మన దగ్గర ఆ ఊసే లేదన్నారు. పక్క రాష్ట్ర సీఎం అప్పుడే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేస్తే.. కేసీఆర్ ఇంతవరకూ ఒక్క సారి కూడా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించలేదని దుయ్యబట్టారు.